చంద్ర‌బాబు సీఎం అవుతారా… ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన మంత్రి బొత్స‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ నేత‌ల‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పించే వైసీపీ ముఖ్య నాయ‌కుడు, మంత్రిబొత్స స‌త్య‌నారాయణ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు సీఎం అవుతారా? నిజ‌మా! అని వ్యాఖ్యానిస్తూనే ఆయ‌న ప‌గ‌ల‌బ‌డిన‌వ్వారు. చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం.. ఆయ‌న‌ను మోసే వారు కూడా అంద‌రూ క‌ల‌లు క‌నొచ్చ‌ని అలా అని అవి నిజం కావ‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు శ‌కం ముగిసిపోయింద‌ని.. ఇప్పుడు ఎవ‌రికీ ఆయ‌న గుర్తు లేడ‌ని.. అందుకే ప‌దే ప‌దే ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని అనుకుంటున్నార‌ని బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అదేస‌మ‌యంలో టెక్క‌లి ఎమ్మెల్యే టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పైనా బొత్స కౌంట‌ర్ విసిరారు. “అచ్చెన్నో.. బుచ్చ‌న్నో.. ఏదో మాట్లాడ‌తాడు. ఎవ‌రికీ అర్ధం కావు. ఆ ప‌నికిమాలిన మాట‌ల‌ను టీడీపీ వాళ్లు పండ‌గా భావిస్తారు. దానికి నేనేం చేయ‌ను. ఏదో వాగుతాడు.. వాగ‌నీయండి” అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని చెబుతున్న‌వారు.. టీడీపీ హ‌యాంలో ఏం చేశారో కూడా చెప్పాల‌ని బొత్స ప్ర‌శ్నించారు. ఏ ఒక్క కార్య‌క్ర‌మానికైనా.. టీడీపీ ముద్ర ఉందా? అని ప్ర‌శ్నించారు.

“ఇది మా ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ప‌థ‌కం.. ఇది మా పార్టీ పెట్టిన ప‌థ‌కం అని ఏదైనా ఒక్క‌టి ఒక్క‌టుంటే చెప్ప‌మనండి అచ్చెన్నాయుడిని” అని బొత్స ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడులు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని.. బూట‌కాలేన‌ని చెప్పారు. వీటిని ఇటు కుప్పం ప్ర‌జ‌లు, అటు టెక్క‌లి ప్ర‌జ‌లు కూడా విశ్వ‌సించే ప‌రిస్థితి లేద‌ని బొత్స వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. వీళ్ల‌కి ప్ర‌జలు, ఓట్లు గుర్తుండ‌వని.., అప్పుడు వ్యాపార‌స్తులు.. త‌మ‌కు భ‌జ‌న చేసేవారే గుర్తుంటార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. “చంద్రబాబు అటు ఇటు తిప్పినా సీఎం కాలేడు. 160 రోజుల్లోనే కాదు.. 664 రోజులైనా కూడా సీఎం కాడు” అని బొత్స వ్యాఖ్యానించారు.