నింగికెగసిన చంద్రయాన్-3…మోదీ హ్యాపీ

భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా చంద్రయాన్-3 ఎప్పుడెప్పుడు నింగికెరుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ిచంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది.

అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి. తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఏ దేశం కూడా చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవంపైకి శాటిలైట్ ని పంపలేదు. కానీ. ఆ ఘపత దక్కించుకున్న తొలిదేశంగా భారత్ అవతరించింది.

చంద్రయాన్-3 విజయవంతంగా చేర్చిందని, కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుందని ఆయన వెల్లడించారు. 40 రోజుల తర్వాత అంటే ఆగస్టు 23 నుంచి 24 తేదీలు మధ్యలో చంద్రుడిపై చంద్రయాన్ దిగుతుందని వెల్లడించారు. ఈ విజయం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం అని అన్నారు. ఈ విజయం భారతీయ శాస్త్రవేత్తల అంకితభావానికి, అకుంఠిత దీక్షకు నిదర్శనమని కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని మోడీ తెలిపారు.