చంద్రబాబును ఇరుకున పెట్టిన రేవంత్

రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు. కానీ ఆయనకు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. రేవంత్ ఎదుగుదలకు ప్రధాన కారణమైన తెలుగుదేశం పార్టీ మీద, అలాగే చంద్రబాబు మీద ఆయనకు ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. ఇప్పటికీ ఆయన్ని తెలుగుదేశం నాయకుడిలా, ఆ పార్టీ సానుభూతి పరుడిలా చూసేవాళ్లున్నారు.

టీడీపీని వీడి చాలా ఏళ్లయినా.. చంద్రబాబును ఎప్పుడూ పల్లెత్తు మాట అనడు రేవంత్. అలాగే టీడీపీ మద్దతుదారులు కూడా రేవంత్ మీద ఈగ వాలనివ్వరు. కాంగ్రెస్ అంటే దశాబ్దాల వ్యతిరేకత ఉన్నప్పటికీ.. రేవంత్ అధ్యక్షుడు కావడం వల్ల కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న వాళ్లూ చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లందరికీ షాకిచ్చేలా చంద్రబాబు మీద పరోక్షంగా రేవంత్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని.. మూడు గంటలు చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రైతుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. వాళ్లను రెచ్చగొట్టి రేవంత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించేలా చేస్తున్నారు బీఆర్ఎష్ నాయకులు. ఐతే తనపై దాడిని తిప్పికొట్టడానికి, తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పటి రోజుల గురించి ప్రస్తావించాడు.

అప్పట్లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడితే..అందులో పాల్గొన్న రైతులను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పిట్టల్ని కాల్చినట్లు కాల్చిందని రేవంత్ అన్నాడు. ఆ ప్రభుత్వంలో కేసీఆర్ కీలకంగా ఉన్నారని.. పాలసీ విధానాలను నిర్ణయించే కమిటీలో ఆయనది ముఖ్య పాత్ర అని రేవంత్ విమర్శించాడు.

అప్పుడు అలా రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రైతుల మేలు గురించి మాట్లాడటం ఏంటని రేవంత్ ప్రశ్నించాడు. కేసీఆర్‌ను విమర్శించడం ఏమో కానీ.. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రైతులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిందని పేర్కొనడం ద్వారా బాబు అభిమానులు, తెలుగుదేశం మద్దతుదారుల్లో వ్యతిరేకత తెచ్చుకున్నాడు రేవంత్.