ఏపీలో ఎన్టీఆర్ కూతురు.. తెలంగాణలో వైఎస్సార్ కూతురు..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సత్తా చాటడానికి వారసులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలోనే కాదు ముఖ్యమంత్రి స్థాయిలోనూ కుర్చీ ఎక్కడానికి వారసులు యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి అందుకోగా… ఆయన స్థానంలోకి వచ్చేందుకు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ కూడా రాజకీయంగా జోరు చూపిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. అటు తెలంగాణలోనూ ప్రస్తుత సీఎం కుమారుడు కేటీఆర్ తండ్రి వారసత్వం ఎప్పుడెప్పుడు కుర్చీ రూపంలో తనకు దక్కుతుందా అని నిరీక్షిస్తున్నారు. అయితే… వారసులుగా కేవలం కుమారులే కాదు కుమార్తెలూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు.. కానీ, ముఖ్య పదవులకు మాత్రం ఇంకా దగ్గరగా రాలేకపోతున్నరు.

ఏపీ విషయానికొస్తే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాట పురందేశ్వరి చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతేకాదు.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడంతో బీజేపీలో చేరారామె. బీజేపీలో చేరిన తరువాత లోక్ సభ ఎన్నికలలో రాజంపేట నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీలో కొనసాగుతున్నా ప్రభావం చూపలేకపోయారు.

అయితే, కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొద్దిరోజుల కిందటే పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని చేశారు. దీంతో ఆమెకు మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. ఏపీలో జగన్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పెద్దగా పోరాడిందేమీ లేకపోవడంతో ఇప్పుడు పురందేశ్వరి నాయకత్వంలో బీజేపీ స్పీడు పెంచుతుందని అంతా ఆశిస్తున్నారు. ఈ నెల 13న బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆమె ఆ తరవాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఏపీలో జీరో అన్నట్లుగా ఉన్న బీజేపీకి ఆమె ఎంతమేర జవసత్వాలు ఇస్తారో చూడాలి.

ఇక పురందేశ్వరి లాగే మరో దిగ్గజ నాయకుడి కుమార్తె వైఎస్ షర్మిల కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, ఏపీ సీఎం జగన్ సోదరిగానే కాదు సొంతంగా కూడా ఆమె ఇమేజ్ సృష్టించారు. ఆ ఇమేజ్ కారణంగానో.. లేదంటో అన్న జగన్‌తో ఉన్నాయంటున్న విభేదాల కారణంగానో ఆమె తెలంగాణ కేంద్రంగా రాజకీయ పార్టీ స్థాపించి జనంలోకి వెళ్లారు. తెలంగాణలో పాదయాత్ర చేయడం.. పాలక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌లతో నిత్యం తలపడుతూ వార్తల్లో నిలిచారు. అయినప్పటికీ కొద్ది ప్రాంతాలలో తప్ప ఆమె ప్రభావం అంతగా కనిపించలేదు.

ఇలాంటి పరిస్థితులలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారని, అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్న ప్రచారం కూడా ఒకటి ఉంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఊపులోకి వచ్చింది. ఆ జోరును సీట్లుగా మార్చుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం, తెలంగాణ నాయకత్వం కూడా కోరుకుంటోంది. ఆక్రమంలోనే షర్మిలను కూడా పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ వ్యతిరక ఓటు చీలదని.. రెడ్డి సామాజికవర్గ ఓట్లు కూడా కాంగ్రెస్‌కు వస్తాయని భావిస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా షర్మిల, కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగాయని చెప్తున్నా రెండు వైపుల నుంచి దీనిపై స్పష్టత రాలేదు. ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం మళ్లీ జోరు చూపిస్తారని భావిస్తున్నారు.

మొత్తానికి ఏపీలో ఎన్టీఆర్ కూతురు.. తెలంగాణలో వైఎస్ఆర్ కూతురు ఈసారి రాజకీయాల్లో చర్చనీయమవుతున్నారు. ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ ఇద్దరు కీలక బాధ్యతలు, అవకాశాలు దక్కుతుండడంతో ఎన్నికల నాటికి కీలక నేతలుగా పరిణమిస్తారా? తమతమ పార్టీల దశ మారుస్తారా? వేచిచూడాలి.