జ‌గ‌న్‌.. నువ్వు ఎంత న‌టించినా.. నీలో ఉన్న క్రూర‌త్వాన్ని దాచ‌లేవ్‌: బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “జ‌గ‌న్ నువ్వు ఎంత న‌టించినా.. నీలో ఉన్న క్రూర‌త్వాన్ని దాచ‌లేవ్‌” అంటూ వ్యాఖ్యానించారు. “నాలుగేళ్ల నరకం” అంటూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన హత్యలపై చంద్రబాబు వీడియోలు విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌పై మరో వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలను ఈ వీడియో చంద్ర‌బాబు ప్రస్తావించారు.

రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన నేరాలపై ‘నాలుగేళ్ల నరకం’ అంటూ కొద్ది రోజుల క్రితం తొలి వీడియో విడుదల చేసిన చంద్రబాబు.. హత్యా రాజకీయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎంత సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించినా, కరుణామయుడిలా మరెంత నటించినా లోపలున్న క్రూరమైన వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుందని చంద్ర‌బాబు తీవ్ర‌స్తాయిలో మండిపడ్డారు.

జ‌గ‌న్‌లోని క్రూర‌ వ్యక్తిత్వమే వైసీపీ నేత‌ల‌కు, జ‌గ‌న్ అనుచరులకు మార్గదర్శకత్వం అవుతుందని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. చివరకు ఆ క్రూర‌త్వ‌మే గ‌త నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తోంద‌ని వ్యాఖ్యానించారు. మంగళగిరికి చెందిన ఉమా మహేశ్వర్ యాదవ్, పల్నాడులో చంద్రయ్య, జల్లయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, కర్నూలులో మంజుల సుబ్బారావు హత్యలను వీడియోలో చంద్ర‌బాబు ప్రస్తావించారు. వైసీపీ హింసా రాజకీయాలపై రాష్ట్రమా..? రావణ కాష్టమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.