గులాబీలో గుబులు మొదలైందా?

కాంగ్రెస్ పార్టీ జోరు చూసిన తర్వాత గులాబీపార్టీ నేతల్లో గుబులు మొదలైనట్లుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ గట్టినేతలే. ఈ నేతలను కేసీయార్ పార్టీనుండి బహిష్కరించిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఖమ్మం, మహబూబ్ నగర్లో బహిరంగసభలు నిర్వహించి కాంగ్రెస్ కండువాలను కప్పుకోబోతున్నారు. ఇక్కడే కారుపార్టీ నేతల్లో భయం పెరిగిపోతోందట. పొంగులేటి ఖమ్మంకు ఎంపీగా చేశారు. అలాగే జూపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో గట్టి నేతే.

వీళ్ళిద్దరి కారణంగా ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే వీళ్ళ చేరిక తర్వాత మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాట్లు ప్రచారం జరుగుతోంది. కారుపార్టీ నేతల టాక్ ప్రకారమైతే ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, కరీనంగర్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలం పెరగటం ఖాయమట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా బాగా బలం పుంజుకునే అవకాశముందని కారుపార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

వలసలు, ఘర్ వాపసీ కార్యక్రమాలతో ఇతర పార్టీల నేతలు మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అలాగే మరికొందరు నేతలు కూడా తొందరలోనే చేరబోతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదంతా చూస్తుంటే ముందు బీజేపీకి తర్వాత బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దెబ్బ ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ప్రత్యర్ధిపార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోవటానికి కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందని, అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే మౌత్ పబ్లిసిటీయే ప్రధాన కారణం.

ఇదే సమయంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. అలాగే బీజేపీ నేతలు కూడా బాగా డల్ అయిపోయారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. విభేదాలను పక్కనపెట్టేసి సీనియర్ నేతలంతా ఏకతాటిపైన నిలబడితే తెలంగాణాలో కూడా గెలుపు ఖాయమనే మాట బాగా పనిచేస్తున్నట్లుంది. ఎందుకంటే ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడూ గెలిచే అవకాశం రాదనే టాక్ కూడా ప్రభావం చూపుతోంది. మొత్తానికి గులాబీపార్టీలో గుబులు పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.