త్రిమూర్తులతో బీజేపీ భారీ సభ ?

వచ్చేనెలలలో బీజేపీ భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. జూలై 8వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే బహిరంగసభలో త్రిమూర్తులు పాల్గొనబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. త్రిమూర్తులంటే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలే. ఇప్పటికే మోడీతో జరగాల్సిన  బహిరంగసభ వాయిదాపడింది. అలాగే మొన్నటి 15వ తేదీన ఖమ్మంలో అమిత్ షా ముఖ్యతిధిగా నిర్వహించాల్సిన బహిరంగసభ కూడా వాయిదాపడింది. అందుకనే వచ్చేనెల 8వ తేదీన హైదరాబాద్ లో పార్టీకి సంబంధించిన కీలకమైన సమావేశం జరగబోతోంది.

జూలై 8న ఇక్కడ జరగబోయే జాతీయ స్ధాయి సమావేశానికి 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్చార్జిలు, సంస్ధాగత కార్యదర్శులతో పాటు తెలంగాణా ఇన్చార్జిలంతా పాల్గొనబోతున్నారు. ఇంతభారీగా జరగబోతున్న జాతీయ స్ధాయి సమావేశం తర్వాత అంతే భారీస్ధాయిలో బహిరంగసభ కూడా నిర్వహించాలని తెలంగాణా పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారట. దాంతో మోడీని కూడా తప్పకుండా రావాలని పార్టీ కోరుతున్నది. మోడీ వచ్చే విషయం ఇంకా ఖరారు కాకపోయినా ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ఏచిన్న అవకాశం దొరికినా మోడీ షెడ్యూల్ లో హైదరాబాద్ పర్యటనను చేరుస్తామని హామీ ఇచ్చిందట.

పీఎంవో హామీ ఇవ్వటమే కాకుండా డైరెక్టుగా అమిత్ షా కూడా ఇదే విషయాన్ని మోడీతో చెప్పినట్లు తెలంగాణా నేతలంటున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీని ఎలాగైనా హైదరాబాద్ కు రప్పించాలని అందరు కలిసే ప్లాన్ చేస్తున్నారు.

గ్రౌండ్ లెవల్ వ్యవహారాలను చూస్తే పార్టీ వీకైందన్నది వాస్తవం. కొత్తచేరికలు లేకపోగా ఉన్న నేతలు కూడా ఎంతోకాలం ఉండరని తొందరలోనే పార్టీని వదిలేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో కాంరెస్ మంచి జోష్ మీదుంది. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరారు. వచ్చేనెలలో ఖమ్మం, మహబూబ్ నగర్లో భారీ బహిరంగసభలు నిర్వహించి మద్దతుదారుల సమక్షంలో పార్టీ కండువ కప్పుకోబోతున్నారు. ఒకవైపు కొత్త చేరికలు, ఘర్ వాపసీలతో కాంగ్రెస్ కళకళలాడుతుంటే బీజేపీ వెలాతెలా పోతోంది. అందుకనే కమలంపార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకైనా మోడీ రావాల్సిందే అన్నట్లుగా పట్టుబట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.