అంతా హై కమాండే నడిపిస్తోందా ?

తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు ఇతర పార్టీల నుండి ఎవరైనా కాంగ్రెస్ లో చేరాలంటే వ్యవహారం అంతా దాదాపుగా హైదరాబాద్ లోనే జరిగిపోయేది. ఏదో లాంఛనంగా ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ ను కలిసొచ్చేవాళ్ళంతే. నిజానికి హైకమాండ్ దాకా వెళ్ళే నేతల సంఖ్య చాలా తక్కువగానే ఉండేది. ఎంతో ముఖ్యమైన నేతలు మాత్రమే ముందుగా హైకమాండుతో మాట్లాడుకుని ఢిల్లీలోనే పార్టీ కండువా కప్పుకునేవారు.

అలాంటిది ఇపుడు జరుగుతున్న వ్యవహారమంతా రివర్సులో నడుస్తోంది. ఎందుకంటే ఇపుడు కాంగ్రెస్ లో చేరుతున్న నేతల్లో అత్యధికులు ముందుగా కాంగ్రెస్ హైకమాండుతో మాట్లాడుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళను తర్వాత లాంఛనంగా మాత్రమే కలుస్తున్నారు. ఢిల్లీలోని హైకమాండుకు రాష్ట్రంలోని నేతలకు మధ్య సమన్వయకర్తగా కర్నాటక ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యవహరిస్తున్నారు.

పార్టీలోకి తాజాగా చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎంఎల్సీ దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళంతా ముందుగా డీకేతోనే మాట్లాడుకున్నారు. రాష్ట్ర నేతల్లో ఒకళ్ళతో మాట్లాడితే మరొకళ్ళకు కోపం వచేస్తోంది. రేవంత్ తో మాట్లాడితే రేవంత్ ఒక్కడేనా నేత తాము కాదా అంటు కొందరు సీనియర్లు అలుగుతున్నారు. దాంతో కాంగ్రెస్ లో చేరుదామని అనుకుంటున్న వాళ్ళకు ఇదో పెద్ద సమస్యగా మారింది.

అందుకనే కాంగ్రెస్ లోకి రాదలచుకున్న డైరెక్టుగా డీకేతోనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్లు, హామీల చర్చలన్నీ బెంగుళూరు వేదికగానే జరుగుతున్నాయి. అంతా సెట్ అయ్యిందని అనుకున్న తర్వాత రేవంత్ తో పాటు ఇతర సీనియర్లను కూడా కలుస్తున్నారు. అంతా అయిపోయిందని అనుకున్న తర్వాత ముహూర్తంపెట్టుకుని ఢిల్లీకి వెళ్ళి రాహుల్, ప్రియాంక గాంధిల సమక్షంలో చేరుతున్నారు. తొందరలో పార్టీలో చేరుతున్నారనే ప్రచారంలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కూడా హైకమాండ్ తోనే టచ్ లో ఉన్నారని సమాచారం. మొత్తానికి లోకల్ నేతల నోళ్ళు మూయించి హైకమాండ్ మొత్తం వ్యవహారాలను నడిపిస్తున్నట్లు అర్ధమైపోతోంది.