పాత పవన్ కాదు.. ఏపీ పాలిటిక్స్‌లో కొత్త మాట ఇది

పవన్ కల్యాణ్ సభలకు జనం పోటెత్తుతున్నారు..
ఇందులో కొత్తేం ఉంది? ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి జనం సునామీలా వస్తూనే ఉన్నారు.. అయినా ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తరువాత కాపులంతా ఆయనకు మద్దతుగా ఏకమవుతున్నారు.
అవుతారు.. అవుతారు.. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదంతా ఏమవుతుందో చూద్దాం..
పవన్ కల్యాణ్ ఈసారి చాలా సీరియస్‌గా ఉన్నారు.. ఇక వైసీపీ పని అయిపోయినట్లే..
ఆఁ సీరియస్ పొలిటీషియనే.. నరసాపురంలో యాత్ర ముగిసిన తరువాత సార్ మళ్లీ ‘ఓజీ’ షూటింగుకు వెళ్లిపోతారట.. నెల రోజుల వరకు గాయబ్.. హహ్హహ్హ
ఈసారి నేనే సీఎం అంటున్నారు.. కసి మీద ఉన్నారు
అవును ఆయనే సీఎం.. అంటే చంద్రబాబు మనిషి..
.. ఇలా ఉన్నాయి ఇప్పుడు ఏపీలో రాజకీయ చర్చలు.

జూన్ 14న ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ చేంజ్ వచ్చింది. పవన్ చాలా లెక్క మీద నేరుగా విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి ఇష్యూస్‌ పై ఆయన లేవనెత్తే అంశాలకు వైసీపీ నుంచి కౌంటర్లు కరవవుతున్నాయి. దీంతో టెక్నికల్‌గా వైసీపీకి బయట ఉన్న ముద్రగడ పద్మనాభం లాంటి పాత కాపును పవన్‌పై ప్రయోగిస్తోంది వైసీపీ.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, టికెట్లు ఆశిస్తున్న చాలామంది నేతలు కూడా ఎందుకైనా మంచిదంటూ పవన్ విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు.. లేదంటే మౌనం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం.. పవన్ కొత్త ఊపు తెస్తుండడంతో వారాహి రాష్ట్రంలో మరింత ముందుకు కదుళ్తున్న కొద్దీ ఎలాంటి మార్పులొస్తాయో.. మనకూ పవన్ అవసరం పడొచ్చేమో అన్న లెక్కలతో చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నారు. కొద్దిమంది జగన్ వీరాభిమాన నేతలు, వందిమాగధులు మాత్రం తమ నోటికి పని చెప్తున్నారు.

ముఖ్యంగా ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర సాగుతున్న పాత గోదావరి జిల్లాలలో కాపు నేతలు, కాపు వ్యాపారులు, బీసీ నేతలు ఆఫ్ ద రికార్డ్ మాటల్లో పవన్ ఈసారి డిఫరెంట్‌గా కనిపిస్తున్నారని.. లైట్‌గా తీసుకోవడానికి లేదని చెప్తున్నారు. పవన్ కల్యాణ్ సభలకు ఇంతకుముందు వచ్చిన జనం వేరు.. ఇప్పుడొస్తున్న జనం వేరని అంటున్నారు. తొమ్మిదేళ్లుగా ప్రజల్లో తిరుగుతుండడంతో కొత్తగా ఆయన్ను చూడ్డానికి వెళ్లాలన్న క్రేజ్‌తో కాకుండా రాజకీయంగా మద్దతివ్వడానికి వస్తున్నారని.. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు ఆయన్ను దగ్గర నుంచి చూసి, ఆయన మాటలు విని ఉండడంతో హీరో వర్షిప్‌తో కాకుండా ఇప్పుడు తమ కోసం వస్తున్న నేతగా ఆయన కోసం జనం వెళ్తున్నారని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు పవన్ కూడా తన పంథా మార్చారు. తన బలమేంటి.. బలహీనతలేంటనేది అర్థం చేసుకుని సాగుతున్నారు. లక్ష్యం కోసం తగ్గి నడవాలన్న సత్యం కూడా తెలుసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. రీసెంటుగా ఆయన మిగతా హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు, తన కంటే మహేశ్ బాబు, ప్రభాస్ పెద్ద హీరోలని.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు గ్లోబల్ హీరోలని.. తనకు ఇగోలు లేవని.. అందరు హీరోల అభిమానులు రాష్ట్రం కోసం తనకు మద్దతివ్వాలని కోరడం దీనికి ఉదాహరణ. పవన్ ఈ ప్రకటన చేసిన తరువాత మిగతా హీరో అభిమానుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ జనసేన సభలలో కనిపిస్తున్నారని చెప్తున్నారు.

మరోవైపు కాపుల విషయంలోనూ పవన్ స్పష్టతకు వచ్చారు. మిగతా పార్టీలు, నేతలు కుల రాజకీయాలు చేస్తున్నప్పుడు తాను చేయడంలో తప్పు లేదన్న లెక్కలో ఉన్నారు పవన్. ఈ కారణంగానే గతంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించని ఉభయగోదావరి జిల్లాలపై ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుత వారాహి యాత్ర కూడా ఈ జిల్లాలలోని నియోజకవర్గాలలోనే సాగుతోంది. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరిగా ఉన్న జిల్లాలు ఇప్పుడు కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలుగా మారాయి. వీటిలో మొత్తం 35 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలలో అత్యధిక కాపులు అధిక సంఖ్యలో ఉన్నవే. అందుకే పవన్ ఈ జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఆయన ఆశిస్తున్నట్లుగానే అక్కడ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. జనసేన పార్టీ 2019 ఎన్నికలలో గెలిచిన ఏకైక సీటు కూడా ఈ జిల్లాలలోనే ఉంది. అంతేకాదు.. గత ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన నియోజకవర్గాలూ వీటిలో చాలా ఉన్నాయి.

దీంతో పవన్ ఈసారి గోదావరి జిల్లాలపై ఫుల్ ఫోకస్ పెట్టి జనసేనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చడానికి వ్యూహం పన్నుతున్నారు. ప్రస్తుత యాత్ర తరువాత ఆయన సినీ కారణాలతో గ్యాప్ ఇచ్చినా మళ్లీ తన యాత్ర కొనసాగిస్తే.. రాష్ట్ర మంతా ఈ ఊపు తీసుకొస్తే మాత్రం అభిమానులకు పండగే.