ఇంత మంది కలిసినా మోడీ ని ఓడించగలరా?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కేంద్రంగా విప‌క్ష పార్టీల దూకుడు ప్రారంభ‌మైంది. క‌లిసి వ‌స్తున్న బీజేపీయేత‌ర పార్టీల‌తో విప‌క్షాలు మూకు మ్మడిగా ప్ర‌ధాని మోడీపై యుద్ధానికి రెడీ అయ్యాయి. ప్ర‌ధాని పీఠం అనే మాట ఎత్త‌కుండా.. ఇత‌ర కార్యాచ‌ర‌ణ‌ల దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. అయితే.. సిస‌లైన వ్యూహం ఎన్నిక‌లే. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొని.. పోరులో పైచేయి సాధించిన ప్పుడే మోడీపై పైచేయిసాధించ‌డం అనేది సాధ్య‌మ‌వుతుంది. అంటే.. పైకి ఎంత చెబుతున్నా.. ఎన్ని వ్యూహాలు.. వేస్తున్నా.. ఎన్ని స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నా.. అంతిమంగా పార్టీల‌కు బ‌లం కావాలి.

మోడీ వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికిప్పుడు ప్రాంతీయ పార్టీల వ‌ద్ద ఉన్న ఆయుధాలు ఏంటి? ఆయా పార్టీల‌కు ఉన్న ఓటు బ్యాంకు ఎంత‌? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. బీజేపీ ఒక్క‌పార్టీకే జాతీయ‌స్థాయిలో దేశ‌వ్యాప్తంగా 303 స్థానాలు ఉన్నాయి. ఇక‌, బీజేపీని ప్ర‌త్య‌క్షంగా , ప‌రోక్షంగా బ‌ల‌ప‌రిచే పార్టీల సంఖ్య వేరేగా ఉంది. ఇది కూడా క‌లిస్తే..ఈ బ‌లం పెరుగుతుంది. మ‌రి మోడీపై స‌మర శంఖం పూరించిన బీజేపీయేత‌ర పార్టీల సంఖ్యాబ‌లం కేవ‌లం 197 మాత్ర‌మే. ఇది ఇప్ప‌టికిప్పుడు లోక్‌స‌భ‌లో ఉన్న సంఖ్య‌.

దీనిని పెంచుకుని.. మొత్తం 547 స్థానాల్లో మేజిక్ ఫిగ‌ర్‌ను చేరుకునేందుకు ఆయా పార్టీలు మ‌రింత కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. కేంద్రంలో పాగా వేసేందుకు మ‌రింత వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల్సి ఉంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ‌స్థాయిలో పుంజుకుంటేనే త‌ప్ప‌.. ఇది సాధ్యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రంలో అధికారం చేప‌ట్టేందుకు క‌నీస మేజిక్ ఫిగ‌ర్ 275 స్థానాలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ క‌నీసం 150 స్థానాల్లో పుంజుకుంటే త‌ప్ప ఇది సాధ్యం కాద‌నే అంచ‌నాలు వున్నాయి.

అయితే.. కాంగ్రెస్‌కు ఇది సాధ్య‌మేనా? అంటే ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌డం సాధ్యం కాదు. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 50 కి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ పార్టీ భార‌త్ జోడో యాత్ర‌తో పుంజుకుంద‌ని భావిస్తున్నా..లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇది ఎలా మారుతుందో చూడాలి. మ‌రోవైపు.. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా మోడీని వ్య‌తిరేకిస్తున్న‌పార్టీలు కూడా పుంజుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని ధీమాగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం పార్టీల్లో అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది.

ప్ర‌స్తుతం మోడీకి వ్య‌తిరేకంగా చేతులు క‌లిపిన‌ పార్టీల్లో టీఎంసీ, డీఎంకే, జేడీయూ మాత్రమే డబుల్ డిజిట్ స్థానాలను సాధించాయి. ఆర్జేడీ, సీపీఐ (ఎంఎల్) పార్టీలు కనీసం ఒక్క సీటును కూడా సంపాదించలేదు. ఇక‌, మోడీని వ్య‌తిరేకిస్తున్నామ‌ని చెబుతున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు.. యుద్ధంలోకి దిగేందుకు స‌సేమిరా అంటున్న ప‌రిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే.. యుద్ధం రెడీ అవుతున్నా.. స‌న్న‌ద్ధ‌త‌, బ‌లం విష‌యంలో తేలిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.