ద‌మ్ముంటే నాపైపోటీ చేసి గెలువ్‌… ప‌వ‌న్‌

కాకినాడ సిటీ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. వారాహి యాత్ర‌లో భాగంగా ఆదివారం రాత్రి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ద్వారంపూడిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న బాగోతం బ‌య‌ట పెడ‌తాన‌ని, ప‌రుగులు పెట్టిస్తాన‌ని.. ప్ర‌జాధ‌నం క‌క్కిస్తాన‌ని.. తాట‌తీస్తాన‌ని ఇలా.. ద్వారంపూడిపై విరుచుకుప‌డ్డారు. దీనికి కౌంట‌ర్‌గా తాజాగాద్వారంపూడి.. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధించారు.

తనను విమర్శించేస్థాయి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేదని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాను మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. పవన్‌ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు. ‘‘పొలిటికల్‌గా పవన్‌ జీరో. ఆయన అజెండా ఏంటి? ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు అమాయకులనుకుంటున్నారా? మార్చి 14న సీఎం అయ్యే అర్హత లేదని చెప్పిన‌ పవన్‌.. సరిగ్గా మూడు నెలల తర్వాత జూన్‌ 14న కత్తిపూడి సభలో మాట మార్చారు“ అని అన్నారు.

ఇప్పుడు ప‌వ‌న్ త‌న‌న‌ను ఎమ్మెల్యే, సీఎంను చేయండి అని అడుగుతున్నారు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతోనే ఆయన మాటమార్చారు అని ద్వారంపూడి వ్యాఖ్యానించారు. త‌న‌పై చేసిన ఆరోపణలను పవన్‌ నిరూపించాల‌ని అన్నారు. కాకినాడలో గత 50 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. సామాజికవర్గం పరంగా ఎలాంటి బలం లేకపోయినా ఇక్కడి ప్రజలు రెండు సార్లు గెలిపించారని అన్నారు.

“కాకినాడలో నన్ను ఓడించడం పవన్‌ వల్ల కాదు. నన్ను ఓడిస్తానని ఆయన చేసిన ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నా. దమ్ముంటే కాకినాడలో నాపై పవన్‌ పోటీ చేయాలి.. ఆయన్ను తుక్కుతుక్కుగా ఓడిస్తా. పవన్‌ ఎమ్మెల్యే, సీఎం అవ్వాలంటే ఆయనకు సినిమాల్లోనే సాధ్యం’’ అని ద్వారంపూడి నిప్పులు చెరిగారు.