ఏపీ ప్ర‌భుత్వంపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య నీటి వాటా పంప‌కాలు, ప్రాజెక్టుల విష‌యంలో క‌య్యం ముదురుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమీ మాట్లాడుకుండా చెయ్యాల్సిందేదో చేసుకుపోతుంటే.. దీనిపై కోర్టులను ఆశ్ర‌యించ‌డ‌మే కాక నేరుగా ఘాటు విమ‌ర్శ‌ల‌కూ సిద్ధ‌మ‌య్యారు తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లు. జ‌గ‌న్ త‌న‌కు మిత్రుడే కానీ.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే రాజీ ప‌డేది లేదంటూ తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిక నేరుగా ముఖ్య‌మంత్రి కేసీఆరే రంగంలోకి దిగి జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ అర్థం పర్థంలేని, నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కేసీఆర్‌ అన్నారు. నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై చర్చించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ‘‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పాం. బేసిన్లు, భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామన్నాను. కానీ ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. ఏపీ అర్థరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీకి కల్పిస్తాం’’ అని కేసీఆర్‌ అన్నారు.తెలంగాణ ఏర్పాటుకు ముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు సరికాదని.. తెలంగాణకు ఉన్న వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు.