కాంగ్రెస్ ఊపందుకుంటోందా?

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో కాంగ్రెస్ మంచి ఊపుమీదుంది. సీనియర్ నేతలిద్దరూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరటం ఖాయమైపోయినట్లే. ఈ నెల 20 లేదా 25వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఆ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలను రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరిక సందర్భంగా బహిరంగసభ నిర్వహించబోతున్నారు.

జూపల్లిని పక్కనపెట్టేసినా పొంగులేటి చేరటం అన్నది కాంగ్రెస్ కు కచ్చితంగా బాగా బూస్టప్ ఇస్తుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే ఖమ్మం మాజీ ఎంపీ  పొంగులేటి ఆర్ధిక, అంగబలాల్లో అత్యంత పటిష్టంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా బలమైన మద్దతుదరులు, అనుచరులున్న నేత. ఖమ్మం జిల్లాలో అభ్యర్ధులతో పాటు మరికొందరు అభ్యర్ధులకు కూడా ఎన్నికల్లో నిధులు సర్దుబాటు చేయగలిగినంత సామర్ధ్యం ఉన్న నేత పొంగులేటి.

అందుకనే మాజీఎంపీని పార్టీలోకి చేర్చుకోవటానికి బీజేపీ శతవిధాల ప్రయత్నాలుచేసింది. బీజేపీలో చేరుంటే ఆర్ధికపరమైన అవసరం లేకపోయినా అభ్యర్ధులందరినీ పొంగులేటి పెట్టాల్సొచ్చేది. తన ఓట్లే పార్టీ ఓట్లుగా ఉండేది పరిస్ధితి. కానీ తాను కాంగ్రెస్ లో చేరబోతున్నారు కాబట్టి పార్టీ ఓటుబ్యాంకుకు తన సొంత ఓట్లు కూడా తోడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ నేతలకు మద్దతుగా తన మద్దతుదారులు కూడా కలుస్తారు.

 కాకపోతే పొంగులేటి మద్దతుదారులకు కాంగ్రెస్ కొన్ని టికెట్లు ఇవ్వక తప్పదు. టికెట్ల సర్దుబాటు విషయంపైన కూడా పొంగులేటి కాంగ్రెస్ అగ్రనేతల నుండి  గట్టి హామీ తీసుకున్నట్లు సమాచారం. అవసరమైన అన్నీ హామీలను తీసుకున్నతర్వాతే పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. పొంగులేటి, జూపల్లి చేరగానే మరికొందరు సీనియర్లు కూడా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరగబోతోంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని, బీజేపీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.