కేసీఆర్ స్పీడ్ : 70 మందితో లిస్టు రెడీ అవుతోందా ?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపికపై కేసీయార్ కసరత్తులో స్పీడుపెంచినట్లు తెలుస్తోంది. దశాబ్ది ఉత్సవాలు అయిపోగానే మొదటిజాబితాగా 70 మందికి టికెట్లు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట. ఆరునెలలకు ముందే టికెట్లను ప్రకటించేస్తానని గతంలోనే కేసీయార్ ప్రకటించిన విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు ఇపుడు గుర్తుచేస్తున్నాయి. గతంలో ఛెప్పినట్లుగానే తమ అధినేత మొదటి జాబితాలో 70 మందికి టికెట్లను ప్రకటించబోతున్నట్లు చెప్పాయి.

ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించన తర్వాత లేకపోతే నామినేషన్లకు ముందు అభ్యర్ధులను ప్రకటించటం వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయన్నది కేసీయార్ ఆలోచనట. అభ్యర్ధులను ముందుగా ప్రకటించటం వల్ల అసంతృప్తులు, తిరుగుబాటుదారులుంటే వాళ్ళని దారిలోకి తెచ్చుకునేందుకు అవకాశముంటుందని కేసీయార్ ఆలోచించారట. ఒకవేళ తిరుగుబాట్లతో కొందరు నేతలు పార్టీకి దూరమైనా పర్వాలేదన్నట్లుగా ఆలోచించారట.

టికెట్లు ఇవ్వకూడదని తీసుకునే నిర్ణయం నియోజకవర్గాల్లో సదరు నేతలకు బాగా మైనస్సులున్న కారణంగానే అని అర్ధమవుతోంది. అంత మైనస్ పాయింట్లున్న సిట్టింగ్ ఎంఎల్ఏలు పార్టీకి దూరమైతే మాత్రం వచ్చే నష్టం ఏముటుందన్నది కేసీయార్ లాజిక్ గా చెబుతున్నారు. అయితే మొదటి జాబితాలో ఉండబోయే అభ్యర్ధులు ఎవరు ఆ నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వకూడదని డిసైడ్ చేసిన సిట్టింగుల ప్రభావం ఎంతుంటుంది అనే విషయాలపై కేసీయార్ ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.

బీఆర్ఎస్ తరపున పోటీకి అవకాశం రాని నేతలు, టికెట్లు కోల్పోయే సిట్టింగులతో కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పవని కేసీయార్ ఆలోచించారట. అందుకనే ముందుగానే ప్రత్యామ్నాయాలను చూసుకుని టికెట్లు ప్రకటిస్తే అభ్యర్ధులు బలోపేతమయ్యేందుకు అన్నీ అవకాశాలుంటాయని ఆలోచించారు. అయితే టికెట్లు దక్కని అభ్యర్దుల్లో ఇతర పార్టీలకు వెళ్ళేవారి సంఖ్య తక్కువగానే ఉంటుందన్నది కేసీయార్ అంచనాట.

ఎందుకంటే బీఆర్ఎస్ లో టికెట్ దక్కలేదని కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళి పోటీచేసే అవకాశాలు చాలా తక్కువమందికి మాత్రమే వస్తాయని అంచనా వేశారట. మహాయితే బీజేపీలోకి వెళ్ళి టికెట్లు తెచ్చుకుంటారని కూడా అనుకుంటున్నారట. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇప్పటికే నేతలు ఎక్కువగా ఉన్నారు. టికెట్లకోసం పోటీ పడుతున్నారు. కాబ్టటి వెళితే గిళితే బీజేపీలోకే వెళ్ళాలన్నది కేసీయార్ అంచనా. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.