అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ.. పొత్త‌ల‌పైనే చ‌ర్చ‌లు?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తుల విష‌యాన్ని తేల్చే ప‌నిలో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ.. వైసీపీని ఓడించాల‌నే ధ్యేయంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సుమారు 50 నిమిషాలపాటు భేటీ కావ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చనీయాంశ‌మైంది.

2014లో బీజేపీ-టీడీపీ క‌లిసి పోటీ చేశాయి. ఈ క్ర‌మంలో కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రి ప‌ద‌వులు పొందారు. ఇక్క‌డ ఏపీలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. అయితే.. ప్ర‌త్యేక హోదా నేప‌థ్యంలో 2018లో టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తర్వాత అమిత్‌షా, చంద్రబాబుల భేటీ జరగడం ఇదే ప్రథమం. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది.

రాత్రి 8.55 గంటలకు చంద్రబాబు ఒక్కరే కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని అమిత్‌షా ఇంటికి వచ్చారు. తర్వాత కొద్దిసేపటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మధ్య రాత్రి 9.49 గంటల వరకు సమాలోచనలు జరిగాయి. సమావేశం అనంతరం ఎవరూ మీడియాతో మాట్లాడలేదు.హోంమంత్రితో జరిగిన సమావేశంలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నందున దీన్ని రాజకీయపరమైన భేటీగా భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై చర్చించారా.. ఇంకా ఏదైనా అంశాలపై సమాలోచనలు జరిపారా.. అనేది తెలియరాలేదు.

చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావులతో కలిసి ల్లీకి వచ్చిన చంద్రబాబునాయుడుకు విమానాశ్రయంలో వైసీపీ రెబ‌ల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. అనంతరం అంతా కలిసి ఇక్కడి అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసానికి చేరుకుని అల్పాహారం స్వీక‌రించారు.