తీహార్ జైల్లో పెట్టినా గెలుపు నాదే

టీడీపీ మాజీ మంత్రి, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకొనేందుకు వైసీపీ నేత‌ల‌తో చేతులు క‌లిపి.. కుట్ర పన్ని కేసులు పెట్టారని టీడీపీ నేత‌, భూమా కుటుంబానికి స‌న్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై నిప్పులు చెరిగారు. సుబ్బారెడ్డి చున్నీ లాగారని ఆమె అన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే తనను మాత్రమే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి వస్తే హోం మంత్రి పదవిని మహిళకే ఇవ్వాలని, దీనిని తాను కోరుకుంటున్నాన‌ని చెప్పారు. అప్పుడు తానేంటో చూపిస్తాన‌ని అన్నారు. తనను తీహార్‌ జైల్లో పెట్టినా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్య‌క్తం చేశారు. అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చినట్లు భూమా స్పష్టం చేశారు. ఏవీ సుబ్బరెడ్డి పార్టీలో ఉంటే.. ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉన్న గుంట నక్కల గురించి నారా లోకేష్ చూసుకుంటారన్నారు.

ఎన్ని కేసులు పెట్టినా.. ఆళ్ళగడ్డ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. నంద్యాలలో మాట్లాడిన ఆమె పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంత కాలంగా అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడంతో ఆయన గాయ‌ప‌డ్డారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది.

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ సమక్షంలోనే టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. అప్పట్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. ఇటీవ‌ల భూమా అఖిల ప్రియ బెయిల్‌పై బ‌య‌ట‌కు రాగా, ఆమె భ‌ర్త మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు.