మ‌హానాడు.. అస‌లు ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే..

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిజిల్లా కేంద్రం రాజ‌మండ్రి (రాజ‌మహేంద్ర‌వ‌రం)లో శ‌నివారం నుంచి రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న మ‌హానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు దేశం పార్టీ ఏర్ప‌డి 41 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. తెలుగు వారి తెర వేల్పు అన్న‌గారు ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత‌.. కొన్నాళ్ల నుంచి మ‌హానాడును పార్టీ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. అయితే.. తాజా మ‌హానాడు నేప‌థ్యంలో అస‌లు ఈ మ‌హానాడు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశార‌నేది ఇప్పుడు చూద్దాం.

మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతీ సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు. ఇది మూడు రొజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు మహానాడు కార్యక్రమాలను ఏదో ఒక నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ సమావేశాల్లో రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారవుతుంది. అస‌లు మ‌హానాడు ఎందుకు వ‌చ్చింద‌నేది చూస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. అప్ప‌ట్లో అంటే.. 1985ల‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా పుంజుకునే ప్ర‌య‌త్నం చేసింది. అప్ప‌టికే కాంగ్రెస్‌కు ద‌న్నుగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గంలో చీలిక‌లు ఏర్ప‌డి.. కొత్త పార్టీలు పుట్టుకువ‌చ్చాయి.

అలాకాదు.. అంద‌రూ స‌మైక్యంగా ఉండాలంటూ.. రెడ్డి నాయ‌కులు.. క‌ర్నూలులో భారీ స‌భ నిర్వ‌హించా రు. ఇది రెండు రోజుల పాటు జ‌రిగింది. అంటే.. ఒక ర‌కంగా.. ఇది రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని కాంగ్రెస్ త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌రిగిన స‌భ‌గా అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యం తెలిసిన ఎన్టీఆర్‌.. దీనికి పోటీగా.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఉద్దేశంతో మ‌నం కూడా ఒక స‌భ‌ను ఏర్పాటు చేద్దాం.. అని పార్టీ ముఖ్య‌నాయ‌కుల‌కు సూచించారు. ఈ క్ర‌మంలో ఓ ప‌త్రికా అధినేత దీనిపై అనేక రూపాల్లో వార్త‌లు ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనే అన్న‌గారి పుట్టిన రోజు మే 27న ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు. అలా.. మ‌హానాడు మొద‌లైంది. అయితే.. మ‌హా అనే పేరు రావ‌డం వెనుక కూడా అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు వ‌చ్చాయి. దీనికి మ‌హా అనే ప‌దం ఎందుకు వాడార‌నేది కూడా ఆస‌క్తి దాయ‌క‌మే. మ‌హా అంటే.. మొత్తం స‌మీక‌ర‌ణ అనే అర్థం ఉంది. అదేవిధంగా గంభీరంగా ఉన్న ప‌దం కూడా. దీంతో అంద‌రినీ క‌లుపుకొని పోయే ఏకైక పార్టీ ఇదేన‌ని చెప్పాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో మ‌హా ప‌దాన్ని ఎంచుకున్నారు. ఇక‌, నాడు అనే ప‌దం కేవ‌లం ఒక ప‌త్రికాధినేత ఇచ్చిన సూచ‌న మేర‌కు తీసుకున్నారు.

ఇలా మ‌హానాడు(అంద‌రినీ క‌లుపుకొని పోయే రోజు) అనే అర్థంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇక‌, మ‌హానాడు తొలినాళ్ల‌లో కేవ‌లం ఒకే ఒక్క రోజు జ‌రిగేది. కానీ, తొలి రెండేళ్ల‌లో ఎక్కువ మంది రావ‌డం.. అంద‌రికీ మాట్లాడే అవ‌కాశం లేక పోవ‌డంతో దీనిని రెండు రోజుల‌కు త‌ర్వాత‌.. మూడు రోజుల‌కు పొడిగించారు. పార్టీ కార్య‌క్ర‌మాలు.. ప్ర‌భుత్వాలపై కార్యాచ‌ర‌ణ వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లోని గండిపేట‌లో ఉన్న ఎన్టీఆర్ నివాసంలోనే జ‌రిగింది. అయితే.. త‌ర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని వివిధ ప్రాంతాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.