టీడీపీ+ జ‌న‌సేన = మైన‌స్ కొడాలి నాని ?

kodali

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, మాజీ మంత్రి , ఫైర్ బ్రాండ్ కొడాలి నాని విష‌యంలో ఈసారి అనుకున్న విధంగా ప‌రిస్థితి ఉండే అవ‌కాశం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆది నుంచి ఆయ‌న‌ను వెనుకేసుకు వ‌స్తున్న కాపు సామాజిక వ‌ర్గం.. ఈ సారి ఆయ‌న‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఉంద‌ని తెలుస్తోంది. ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు అందుకుంటున్న నాని.. 2024లోనూ విజయం ద‌క్కించుకుని రికార్డు సృష్టించాల‌ని భావిస్తున్నారు.

అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఆది నుంచి నానికి అండ‌గా ఉంటూ వ‌చ్చిన కాపు సామాజిక వ‌ర్గం.. త‌ప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కాపుల ఓటు బ్యాంకు 35 వేల నుంచి 40 వేల వ‌ర‌కు ఉంటుందని చెబుతున్నారు. ఇక‌, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓటు బ్యాంకు ల‌క్ష పైచిలుకు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు వైసీపీకి అండ‌గానే ఉన్నా.. గెలుపు ఓట‌ముల నిర్ణ‌యం మాత్రం కాపుల చేతిలో ఉంద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. వీరే నిర్ణ‌యాక శ‌క్తిగా ఎదిగారు.

టీడీపీ నాయ‌కుడు రావి వెంక‌టేశ్వ‌రావు వ‌ర్సెస్ కొడాలి నానిల మ‌ధ్య ఓటు బ్యాంకు తేడా వేలల్లోనే ఉంటోంది. ఒక‌సారి 11 వేలు, త‌ర్వాత 17 వేలు.. గ‌త ఎన్నిక‌ల్లో నాని 19 వేల ఓట్ల తేడాతోనే విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరంతా .. కూడా కాపులేన‌ని అంటారు. అయితే.. నానిని ఓడించి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న టీడీపీ.. ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. దీనికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుని టీడీపీ-జ‌న‌సేన ముందుకుసాగితే.. కాపుల ఓటు బ్యాంకు జ‌న‌సేన మ‌ద్దతుగా ఉన్న టీడీపీకే ప‌డ‌తాయ‌ని గుడివాడ‌లోని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌, క‌మ్మ వ‌ర్గం కూడా.. నాని వ్య‌వ‌హార శైలితో విసిగిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు స‌గం చీలి.. టీడీపీకి ప‌డినా.. నాని ఓట‌మి అంచుల‌కు చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

అంటే.. రావి వెంక‌టేశ్వ‌ర‌రావు స్వ‌ల్ప మెజారిటీతో అయినా.. గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. అయితే, ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉండ‌డంతో ఈ లోపు స‌మీక‌ర‌ణ‌లు మారితేనే త‌ప్ప‌.. నాని విజ‌యం, ఓట‌మిపైఇప్పుడే ఏమీ చెప్ప‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.