బ‌న‌గానప‌ల్లెలో సంప్ర‌దాయం రిపీట్ అవుతుందా..?

ఉమ్మ‌డి క‌ర్నూలు ప్ర‌స్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ దూకుడు పెరిగిందా ?  ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాలు ఏంటి? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ఇక్క‌డ నుంచి ప్రాతిని ధ్యం వ‌హిస్తున్న వైసీపీ నాయ‌కుడు కాట‌సాని రామిరెడ్డిపై వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ స‌ర్వే చేయించారు. ఇలా ఒక‌సారి కాదు.. ఏకంగా రెండు సార్లు చేయించిన స‌ర్వేల్లో కాట‌సాని వెనుక‌బ‌డి న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌ధానంగా కాట‌సానిపై అవినీతి ఆరోప‌ణ‌లు పెరిగిపోయాయ‌ని.. వైసీపీ అధినేత‌కు స‌మాచారం అందింది. పింఛ‌న్ తీసుకునేవారి నుంచి కూడా క‌మీష‌న్లు తీసుకుంటున్నార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి. అదేస‌మ‌యంలో న‌గ‌రానికి దూరంగా.. వెంచ‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చి.. ఎక‌రానికి రూ.ల‌క్ష‌ల్లో క‌మీషన్లు వ‌సూలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఈ ప‌రిణామాల‌తో ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా.. వైసీపీలోనే  ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది.

ఇక‌, ఇదేస‌మ‌యంలో టీడీపీ నాయ‌కుడు బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి కూడా అధికార పార్టీ నేత అవినీతిపై క‌ర‌పత్రాలు పంచుతున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ఆధారాల‌తో స‌హా.. ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. నియోజ‌కవ‌ర్గంలో ఎలాంటి హ‌డావుడి లేకుండానే.. బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి గ్రాఫ్ పెరిగింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇదే విష‌యంపై టీడీపీ క‌న్నా ఎక్కువ‌గా వైసీపీ దృష్టి పెట్టింది.

ఇప్ప‌టికి వ‌రుస ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. 2009లో కాట‌సాని రామిరెడ్డి ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున విజ‌యం ద‌క్కిం చుకున్నారు. త‌ర్వాత ఆయ‌న ఓడిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నా రు. 2019లో ఈయ‌న ఓడిపోయి.. కాట‌సాని వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అంటే గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ..  ఏ అభ్య‌ర్థికీ వ‌రుస‌గా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డం లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా సంప్ర‌దాయం ప్ర‌కారం.. త‌న గెలుపు ఖాయ‌మ‌ని టీడీపీ లెక్క‌లు వేసుకోవ‌డం గ‌మ‌నార్హం.