తెలంగాణలో ఆక‌ర్ష‌ రాజ‌కీయాలు వ‌ర్క‌వుట్ అయ్యేనా?!

మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారే అవ‌కాశం క‌నిపిస్తోందా? కీల‌క నేత‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం ప‌లుకుతోందా? అంటే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా వివిధ పార్టీల‌కు దూరంగా ఉన్న నాయ‌కులు.. అధికార పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న నాయ‌కులు ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న వివేక్, ఈటల రాజేంద‌ర్‌రెడ్డి, త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్న‌ విశ్వేశ్వర రెడ్డి, పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ఆహ్వానించారు. అంతేకాదు.. వివేక్, ఈటల, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు.

సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే… ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు. అయితే.. రేవంత్ మాట ఎలా ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు ఈ ఉద్ధండ నేత‌లుగా ప‌రిగ‌ణిస్తున్న‌వారు వ‌స్తే.. కాంగ్రెస్ పార్టీకి ఒన‌గూరే ప్ర‌యోజ‌నం క‌న్నా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మ‌రింత పెరుగుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పైగా వారంతా కూడా అధికారం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌ద‌వులు కోరుకుంటున్నారు. వీరిని ఆహ్వానించ‌డం ద్వారాకాంగ్రెస్‌లో ఉన్న మెజారిటీ పాత నాయ‌కులు వ్య‌తిరేకంగా స్పందించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఉన్న‌వారు ప‌ద‌వుల కోసం త‌న్నుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో వారిని ఆహ్వానించ‌డం ద్వారా కొత్త కుంప‌ట్లు కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు.