సీబీఐ జోరు.. అవినాశ్ రెడ్డి కంగారు

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబిఐతో దొంగాపోలీస్ ఆట ఆడుతున్నారు. ఇప్పటికే ఆరు సార్లు విచారించిన సీబిఐ ఏడోసారి విచారణకు రావాలని సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేయగా షార్ట్‌ నోటీసు అంటూ అప్పటికే ముందస్తు షెడ్యూలు ఉన్నందున రాలేనని లేఖ రాసిన అవినాష్‌ రెడ్డి మంగళవారం నాటి విచారణకు డుమ్మా కొట్టారు. తనకు నాలుగురోజులు గడువు కావాలని లేఖలో కోరిన మేరకు సానుకూలత వ్యక్తం చేసిన సీబిఐ ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే బుధవారం అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ముందస్తు షెడ్యూలు ప్రకారం వివిధ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి విచారణకు రాని అవినాష్‌ రెడ్డి హఠాత్తుగా సుప్రీం కోర్టుకెళ్ళడం అందరిలో అనుమానాలు పెంచుతోంది. అయితే, అవినాశ్ రెడ్డికి ఇదేమీ కొత్త కాదని.. సీబీఐ పిలిచినప్పుడంతా ఆయన ఇలాగే ఏదో ఒకటి చేస్తున్నారని ఈ కేసును అబ్జర్వ్ చేస్తున్నా లాయర్లు అంటున్నారు. అంతకుముందు కూడా విచారణకు రావాలని పి లువగా వస్తున్నానంటూనే చివరి నిముషంలో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అప్పుడు తనను అరెస్ట్‌ చేస్తారన్న అనుమానంతో హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు అందుకున్నారు. ఆ తర్వాత క్రమంలో సుప్రీం కోర్టు వీటిని రద్దు చేయడంతో తిరిగి ముందస్తు బెయిల్‌పై తెలంగాణా హైకోర్టులో విచారణకు సిద్ధం కాగా, న్యాయస్ధానం జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో సీబిఐని నిలువరించే ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ఇక సీబిఐకి అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు న్యాయపరమైన అడ్డంకులు తొలిగాయి. ఇలా విచారణకు పిలిచిన ప్రతీసారి అవినాష్‌ రెడ్డి సహకరించడం లేదని ఇప్పటికే పలుమార్లు న్యాయస్ధానం దృష్టికి తీసుకువచ్చిన సీబిఐ అవసరమైతే కస్టడీకి తీసుకుని ప్ర శ్నిస్తామని స్పష్టం చేసింది.

ఈ అనుమానంతో అవినాష్‌ రెడ్డి మంగళవారం నాటి విచారణకు రాకుండా గడువు కోరినట్లు కోరి బుధవారం సుప్రీం కోర్టు కె ళ్ళారు. అతని తరుఫు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి చీఫ్‌ జస్టిస్‌ ముందు అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ గురించి మెన్షన్‌ చేశారు. అప్పటి వరకూ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారనే సంగతి ఎవరికీ తెలియదు. వివేకా కేసులో సీబిఐ ఉన్న ఫలంగా స్పీడు పెంచడంతో అవినాష్‌ రెడ్డికి అరెస్టు భయం

పట్టుకుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే… తాజాగా అవినాష్‌ ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఆయన కోరుకున్నదేమీ జరగలేదు. పిటిషన్‌పై ధర్మాసనం ముందు మెన్షన్‌ చేసినా విచారణకు తేదీ ఇవ్వడానికి చీఫ్‌ జస్టిస్‌ నిరాకరించారు. విచారణ అత్యవసరం అయితే రాతపూర్వకంగా అభ్యర్ధన ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. అత్యవసరాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మెన్షనింగ్‌ జాబితా పరిశీలించకుండానే బ్యాచ్‌ల వారీగా తేదీలను కేటాయిస్తామని తెలిపింది. కాగా పిటిషన్‌పై విచారణ వేసవి సెలవుల్లో వెకేషన్‌ బెంచ్‌కు కేటాయించేదీ లేనిది సీజెఐ ధర్మాసనం నిర్ణయించనుంది.

సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారణ జరుపుతుంది. ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాలని అవినాష్‌రెడ్డి కోరే అవకాశం ఉంది. అయితే అవినాష్‌ ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఇంతకుముందు తెలంగాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టే రద్దు చేస్తూ మరోసారి విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు మళ్లీ ముందస్తు బెయిల్‌ కావాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల సీబిఐ తీవ్ర అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సీబీఐ దూకుడు పెంచుతుండడం.. సుప్రీంలో అవినాశ్ ఎత్తులు పారకపోవడంతో కీలక పరిణామాలు ఉండొచ్చని వినిపిస్తోంది.