త‌మ్ముళ్లూ.. తెలుసుకోండ‌యా.. అమ్మను ప్ర‌చారం చేయండ‌యా..!

అమ్మ‌ ఏపీలో అమ్మ‌తో రాజ‌కీయాలు చేయ‌డం వైసీపీ నుంచే ప్రారంభ‌మైంది. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కూడా అమ్మ‌ను రాజ‌కీయాల్లో తిప్పింది లేదు. రాజ‌కీయంగా వాడుకున్న‌దీ లేదు. కానీ, గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ‌ను రాజ‌కీయంగా ఊరూ వాడా తిప్పారు. బైబిల్ చేత ప‌ట్టుకుని ఆమె ప్ర‌చారం చేశారు. వ‌య‌సు కారణంగా కొంత ఇబ్బంది ప‌డినా.. ఆమె త‌న కుమారుడి కోసం క‌ష్ట‌ప‌డ్డారు. తొలి ద‌శ‌లో పార్టీ ఓడిపోయినా.. 2019లో మాత్రం ఆమె చేసిన ప్ర‌చారం క‌లిసి వ‌చ్చింది.

క‌ట్ చేస్తే.. వైసీపీలో అమ్మ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు చేశార‌నే చెప్పాలి. జ‌గ‌న్ కోసం.. ఆమె ప్ర‌త్య‌క్షంగానే ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. ఓట్లు అభ్య‌ర్థించారు. త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. కోసం కూడా ఎప్పుడూ ఆమె బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, తాజాగా టీడీపీ విష‌యానికి వ‌స్తే..ఇక్క‌డ కూడా అమ్మ రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ కోసం.. ఆయ‌న మాతృమూర్తి భువ‌నేశ్వ‌రి.. దిగి వ‌చ్చారు. 100 రోజుల పాద‌యాత్ర‌లో ఆమెపాదం క‌దిపారు.. కుమారుడితో క‌లిసి.. అడుగులు వేశారు.

ఇక‌, దీనిలో మ‌సాలా .. ఏంటంటే.. న‌డిరోడ్డు పై అమ్మ‌కు షూ తొడ‌గ‌డం.. వాటికి లేసులు క‌ట్ట‌డం.. దీనికి పెద్ద ఫొటో షూట్ పెట్టడం. త‌ప్పుకాదు. గ‌తంలో భార‌త్ జోడో యాత్ర జ‌రిగిన‌ప్పుడు రాహుల్‌గాంధీ అంత‌టి వాడే త‌న మాతృమూర్తి సోనియా గాంధీకి లేసులు క‌ట్టి రాజ‌కీయంగా ల‌బ్ధి పొందే ప్ర‌య‌త్నం చేశారు. కాబ‌ట్టి టీడీపీ యువ నాయ‌కుడు ఆ కోణంలో ప్ర‌య‌త్నించార‌నే వాద‌న‌లోనూ త‌ప్పు క‌నిపించ‌డం లేదు. ఇక‌, టీడీపీలో అమ్మ కోణం ఇక్క‌డితో అయిపోలేదు. త‌ర‌చుగా నారా లోకేష్ చెబుతున్న‌ట్టుగా.. త‌న అమ్మ‌ను విమ‌ర్శించిన‌.. దుర్మార్గంగా మాట్లాడిన వారికి ఆయ‌న బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

అంటే.. మొత్తంగా టీడీపీలోనూ అమ్మ రాజ‌కీయంగా కేంద్రం అయింది. అయితే.. ఈ కోణాన్ని.. త‌మ్ముళ్లు ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడేవారే లేరు. అమ్మ సెంటిమెంటును ప‌ట్టించుకుంటున్న‌వారే క‌నిపించ‌డం లేదు. గ‌తంలో వైసీపీలో అయితే.. విజ‌య‌మ్మ కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రిగాయి. ఆమె సెంటిమెంటును బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. కానీ, ఇప్పుడు టీడీపీ తెలుగు త‌మ్ముళ్లు క‌ళ్లు తెర‌వాలి. అమ్మ రాజ‌కీయాన్ని విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. అందుకే త‌మ్ముళ్లూ.. తెలుసుకోండ‌యా.. అమ్మను ప్ర‌చారం చేయండ‌యా!! అంటున్నారు సీనియ‌ర్లు.