బాబు, పవన్ పాలిటిక్స్.. జ‘గన్’ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తులు.. ముఖ్యమంత్రి పదవి మీద కామెంట్ల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియాక్టు అయ్యింది లేదు. తాజాగా బాపట్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష నేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు తన రియాక్షన్ ను తన మాటలతో చెప్పేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పేరు ఎత్తిన వెంటనే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదన్న జగన్.. చంద్రబాబు పేరు విన్నంతనే ఆయన వెన్నుపోటు గుర్తుకు వస్తుందన్నారు.

అదే సమయంలో పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. ‘రెండు సినిమా షూటింగ్స్ మధ్యన రాజకీయ సభలు పెట్టటానికి పవన్ కల్యాణ్ వస్తారు. అదీ బాబు కాల్షీట్లు ప్రకారమే మాట్లాడి రెండు రాళ్లు వేసి వెళతారు. ఇలాంటి వారికి ప్రజా జీవితం అంటే తెలుసా? వీరిద్దరూ అధికారంలో ఉంటే అమరావతిలో ఉంటారు. అధికారం పోతే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉంటారు’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉందన్న జగన్.. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు సంధించారు.

“చంద్ర బాబు.. ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. నలుగురు లేపితే తప్పించి లేవలేని స్థితిలో ఉంది. రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు అయినా పవన్ కల్యాణ్ 175 సీట్లలో అభ్యర్థుల్ని కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటుకు పార్టీని అమ్ముకునే ప్యాకేజీ స్టార్. ముఖ్యమంత్రి సీటు కూడా వద్దని.. దోపిడీలో వాటా ఇస్తే చాలని పవన్ అంటున్నారు” అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.

పొత్తులపైనా ఫైర్ అయ్యారు. “పెళ్లి చేసుకునేదీ వీరే.. విడాకులు తీసుకునేది వీరే. మళ్లీ పెళ్లి చేసుకునేదీ వీరే. దత్త తండ్రికి.. దత్తపుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ స్థాయిలో ఉందంటే మనిద్దరం కలిసి వెళదామంటే చిత్తం అంటారు. విడివిడిగా వెళదామని చంద్రబాబు చెబితే పవన్ అలాగే సార్ అంటారు. చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్ సై అంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ చంద్రబాబు విజయంలా పండుగ చేసుకుంటున్నారు. అక్కడ ఓడిన బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ కోరుకుంటోంది. ఇలాంటి నీచమైన రాజకీయం చూడాల్సి వస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంది వీరే. కాంగ్రెస్ తో అంటకాగింది వీరే. కమ్యూనిస్టులతో కలిసి సాగిందీ వీరే” అంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లది రాజకీయ పోరాటం కాదని.. అధికారం కోసం ఆరాటమన్నారు. వీరికి పేదలకు మంచి చేయాలన్న తపన లేదని.. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్నదే చూస్తారని.. దోచుకున్నది ఎలా దాచుకోవాలని.. దాచుకున్నది ఎలా పంచుకోవాలన్నదే వీరి తాపత్రయంగా పేర్కొన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎందుకు కలుస్తున్నారో ఆలోచించాలని ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్ కోరారు. తాను ఎన్ని కష్టాలు వచ్చినా.. అవమానాలు ఎదురైనా.. ఎన్ని వ్యవస్థల్ని ప్రయోగించినా పదిహేనేళ్లలో ప్రజల తరుపేనే నిలబడ్డాను కానీ రాజీ పడలేదన్నారు. ‘మీ బిడ్డకు మీరే ధైర్యం. మిమ్మల్నే నమ్ముకున్నాడు’ అని తన గురించి..తన కమిట్ మెంట్ గురించి చెప్పుకొచ్చారు.