చంద్రన్న నోట ఆ ఒక్క మాట కోసం ఎదురుచూపు…

వైసీపీ నుంచి సస్పెండైన దగ్గర నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెబెల్ స్టార్ గా మారిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకుని పోరాటాలు కొనసాగిస్తున్నారు. దానికి తోడు చాలా మంది అధికార పార్టీ నేతలు కోటంరెడ్డితో టచ్ లో ఉన్నారు.. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి ఇప్పుడు కోటంరెడ్డి వర్గంలో చేరారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ హాజరవుతున్నారు. కోటంరెడ్డి వర్గం నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేసి ఆరోపణలు సంధిస్తోంది..

ఆదిరెడ్డి భవానీకి మద్దతుగా…

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, మామ అప్పారావులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేస్తే కోటంరెడ్డి హుటాహుటిన నెల్లూరు నుంచి రాజమండ్రి వెళ్లారు. ఆమెను పరామర్శించడంతో పాటు సంఘీభావంగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. టీడీపీ ఓకే అంటే వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలు పచ్చ కండువా కప్పుకుంటారని కోటంరెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు..

బుచ్చయ్య చౌదరితో భేటీ

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే (టీడీపీ) గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కోటంరెడ్డి విడిగా సమావేశమయ్యారు. వైసీపీ అరాచకాలు, రాష్ట్ర రాజకీయాలు చర్చకు వచ్చాయి. అంతకుమించి టీడీపీలో చేరే విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఏ పార్టీలో చేరతారు..

తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానం అందుతోందని కోటంరెడ్డి చెప్పుకుంటున్నారు. విలేకర్లు అడిగితే మాత్రం టీడీపీలో చేరే విషయంపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తానంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. టీడీపీ వైపు నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. వైసీపీ రెబెల్స్ అందరిలోనూ విజయావకాశాలు కోటంరెడ్డికే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నప్పటికీ చంద్రబాబు ఎందుకో తొందరపడటం లేదు. కోటంరెడ్డి వస్తే టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఖాయమని తెలిసినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఆహ్వానం అందడం లేదు. కోటంరెడ్డి కూడా చంద్రబాబుకు ఒక మాట చెప్పాలని చాలా మందిని అభ్యర్థించారు. ఇందుకోసం ఆయన టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక పత్రికాధిపతిని కూడా కలిశారు. ప్రత్యేకంగా ఏమీ చెప్పలేనని, కలిసినప్పుడు మాత్రం ప్రస్తావిస్తానని ఆ పత్రికాధిపతి సమాధానమిచ్చారట. దానితో కోటంరెడ్డికి ఇప్పుడు ఎదురుచూపే మిగిలింది. టీడీపీలో చేర్చకుంటారన్న నమ్మకంతో వైసీపీపై తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇప్పుడు చంద్రబాబు నిర్ణయమే కీలకమవుతుంది..