వైసీపీ విముక్త ఏపీనే ల‌క్ష్యం.. బాబు-ప‌వ‌న్ మరిన్ని భేటీలు: నాదెండ్ల

ఏపీలో వైసీపీని లేకుండా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ల‌క్ష్యం దిశ‌గానే అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు. ఈ అంశంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశార‌ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంద‌న్నారు. ఈ మేరకు విశాఖలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నదే జనసేన అభిమతమ‌ని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు పవన్, చంద్రబాబుతో భేటీ అయ్యార‌ని మనోహర్ స్పష్టం చేశారు. “వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు మేలు జరిగే పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయబోమని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే రాజకీయ భేటీలు ఉంటాయి. ఇవి భవిష్యత్తులోనూ జరుగుతాయి” అని వివ‌రించారు.

ఒక ప్రణాళిక, వ్యూహంతో అభివృద్ధి పంథాలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేలా జ‌న‌సేన అడుగులు ఉంటాయన్నారు. భారతీయ జనతా పార్టీ త‌మ‌ మిత్రపక్షమేన‌ని, కచ్చితంగా రాజకీయంగా దానిని పాటిస్తూ ముందుకు వెళ్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఉత్తరాంధ్రలో అపారమైన మానవ వనరులు, సహజ వనరులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు పాలకులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని, వలసలు పెరిగిపోయాయని అన్నారు. అద్భుతమైన సహజ వనరులను అడ్డగోలుగా దోపిడీ చేశారని విమ‌ర్శించారు.

వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంపై చూపుతున్న ప్రేమ కేవలం కపట నాటకం మాత్రమేన‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక్కడ భూములపై కన్నేసిన వైసీపీ నాయకులు వాటిని దోచుకోవడం కోసమే కొత్త నాటకాలకు తెర తీశారని అన్నారు. నిషేధిత భూముల్లో అక్రమ కట్టడాలు, కనిపించిన ప్రతి జాగా ఆక్రమించుకోవడం ఇప్పటికే పెరిగిపోయిందని మ‌నోహ‌ర్ విమ‌ర్శించారు. ఈ భూముల దోపిడీని అధికారికం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం తాపత్రయపడుతోందని.. అందుకే ఏకంగా సీఎం జ‌గ‌న్ ఇక్క‌డ కాపురం పెడ‌తాన‌ని అంటున్నార‌ని విమ‌ర్శించారు.

జనసేన పార్టీ పూర్తి స్థాయి ప్రణాళికను, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన అభివృద్ధి విజన్ తో ప్రత్యేక మేనిఫెస్టో అందిస్తామ‌న్నారు. కచ్చితంగా ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో జనసేన పార్టీ సంస్థాగతంగా బలం పుంజుకుంటోందని మ‌నోహ‌ర్ చెప్పారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర లో పూర్తిస్థాయిలో రాజకీయంగా సన్నద్ధం అయ్యిందన్నారు.

వైసీపీ విశాఖలో భూదందాలు సాగిస్తోందని నాదెండ్ల చెప్పారు. రుషికొండ నుంచి చర్చి భూముల వరకూ అన్నింటినీ దోచేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల ఆస్తులు కొల్లగొడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. విజయనగరం జిల్లాలో ఒక వృద్ధురాలుకి చెందిన 80 సెంట్ల భూమిని లాక్కొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే విషయంత‌మ‌ దృష్టికి వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక భూ దందాలు, అక్రమ నిర్మాణాలు.. వాటి అనుమతులపై కచ్చితంగా రివ్యూ చేస్తామ‌ని నాదెండ్ల వివ‌రించారు.

ప్ర‌జ‌ల తో మాట్లాడ‌రా?
“విశాఖపట్నం మాకాం మారుస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికీ పలుమార్లు చెప్పారు. జనవరి, మార్చి, అయిపోయింది…. ఇప్పుడు సెప్టెంబర్ లో విశాఖపట్నంలో కాపురం పెడతానని చెబుతున్నారు. అదే విషయాన్ని మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పవచ్చు కదా..? అది ప్రజలకు నేరుగా చేరుతుంది కదా..? ప్రజలను కేవలం మభ్యపెట్టడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కాపురం పెడితే అక్కడ నుంచి పరిపాలన సాగుతుందని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు.” అని నాదెండ్ల విమ‌ర్శ‌లు గుప్పించారు.