జగన్‌కు షాకిచ్చిన బాలినేని

ఏపీ సీఎం జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు ఆయన బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి ఆయన తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆ బాధ్యతల నుండి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, బాలినేని స్వల్ప అస్వస్థతో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి.. సీఎం జగన్ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో రెండవ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుండి బాలినేని వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, రాయబారాలతో బాలినేని మళ్లీ కొంత చల్లారారు.

కానీ, పార్టీలో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విపరీతంగా ప్రాధాన్యం పెరుగుతుండడంతో పాటు పవన్ కల్యాణ్, బాలినేని మధ్య సత్సంబంధాలపై జగన్ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతుండడం.. పార్టీ తనను అనుమానంగా చూస్తుండడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో తనకు విలువ ఇవ్వడం లేదంటూ ఇటీవల అనుచరుల వల్ల ఆయన వాపోయారట.

ప్రస్తుతం అస్వస్తతో హైదరాబాద్‌లో ఉన్నట్లు చెప్తున్నా ఎవరికీ అందుబాటులో ఉండకుండా అలా చేశారని అంటున్నారు. ఆయన పార్టీ మారే సూచనలున్నాయి.. వైసీపీని త్వరలో వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వైసీపీ నుంచి వలసలు మొదలైనట్లే అనుకోవాల్సి ఉంటుంది.