గుంటూరు నేతలపై బాబు గరం గరం

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి కఠినంగా ఉండాలని తీర్మానించారు. అందుకే పార్టీ నేతల దగ్గర మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు. సరిగ్గా పనిచేయని నేతలను నిలదీస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు విడిగా పిలిచి మాట్లాడుతూ పనిచేయని వారికి క్లాస్ తీసుకుంటున్నారు. దారికి రాకపోతే ఇంక అంతేనని హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబు తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాలలో తిరిగారు. పెదకూరపాడు, సత్తెనపల్లి , తాడికొండ నియోజకవర్గాలలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పేరుతో రోడ్ షో లు, బహిరంగ సభలలో పాల్గొన్నారు. తొలి రోజు పెదకూరపాడు నియోజకవర్గం లో పర్యటించారు. అమరావతి లో రోడ్ షో నిర్వహించి, ధరణికోట లో బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే తొలి రోజు పర్యటన చంద్రబాబును నిరుత్సాహ పరిచిందట.

ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లేకపోవడం బాబు అసహనానికి గురయ్యారని చెబుతున్నారు. దీంతో ఆ రోజు రాత్రి ధరణికోట లో బస చేసిన బాబు మరుసటి రోజు క్యాంప్ సైట్ లో ఉమ్మడి గుంటూరు జిల్లా లోన్ 17 నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను పిలిపించి మాట్లాడారు. ఉమ్మడి గుంటూరులో పార్టీ నేతల పనితీరు బాగోలేదని అసంతృప్త వ్యక్తం చేశారట. గుంటూరు జిల్లా కంటే ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి బాగుంటుందని చెప్పారట. గుంటూరు జిల్లా నేతలలో చాలా మంది సీనియర్లమనే ధీమా ఉందని, అలాంటి ధీమాలు వదిలి పార్టీ కోసం పని చేస్తే బాగుంటుందని చురకలు అంటించారట. సొంత పనులపై ఇంట్రస్ట్ పెట్టి పార్టీ పనులు చూడని వారికి ప్రత్యామ్నాయం వెదుక్కోవాల్సి వస్తుందన్నారు.

కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉన్న తాము రాష్ట్ర సంక్షేమం కోసం ఓ మెట్టు దిగి పనిచేస్తుంటే మిగతా వారికి ఇబ్బందేమిటని చంద్రబాబు నిలదీశారు. సమిష్టిగా ఎందుకు పనిచేయడం లేదని, కార్యకర్తల వద్దకు ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు.

గతంలో చంద్రబాబు ఏ సమస్యనైనా చూసి చూడనట్లుగా వదిలేసేవారు. ఇప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడటంతో గుంటూరు నేతలు ఖంగుతిన్నారు. దాని తర్వాత సత్తెనపల్లి, మేడికొండూరు బహిరంగ సభలకు నేతలు అంకితభావంతో విజయవంతం చేశారు. ఇదే ఊపు ముందు నుంచి ఉంటే చంద్రబాబు దగ్గర తిట్లు పడేవి కాదని కొందరు చర్చించుకుంటున్నారు.