బీజేపీ నినాదం – ముస్లింల ఓట్లు మాకొద్దు

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కర్నాటకలో సామాజికవర్గాల సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మామూలుగా కర్నాటక ఎన్నికలంటే ఒక్కలిగలు, లింగాయతుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అయితే తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఇపుడు పై సామాజికవర్గాలతో పాటు ముస్లింల గురించి కూడా చర్చలు పెరిగిపోతున్నాయి. ఒక్కలిగలు, లింగాయతుల జనాభా సుమారు చెరో 15 శాతం ఉంటుందని అంచనా. అందుకనే వీళ్ళ మద్దతు ఏ పార్టీకైనా చాలా కీలకమవుతోంది.

అయితే ఈసారి వీళ్ళతో పాటు ముస్లింల ఓటుబ్యాంకు కూడా కీలకమైపోయింది. కారణం ఏమిటంటే ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దుచేయటమే. తమకు ముస్లిం ఓట్లు అవసరం లేదని కమలనాదులు స్పష్టంగానే ప్రకటించేస్తున్నారు. ముస్లింల ఓట్లు అవసరంలేదన్న ఉద్దేశ్యంతోనే వాళ్ళకి ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో ముస్లింల జనాభా సుమారు 13 శాతముంది. సుమారు 40 నియోజకవర్గాల గెలుపోటముల్లో వీళ్ళే నిర్ణయాత్మకం.

మొదటినుండి కాంగ్రెస్ పార్టీకే ముస్లింలు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉండేవారు. అయితే కొన్ని పరిస్ధితుల కారణంగా అప్పుడప్పుడు మారుతుండేవారు. ఇపుడు తాజా పరిణామాల్లో ముస్లింల ఓట్లకోసం కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ కూడా పోటీపడుతోంది. గడచిన ఐదేళ్ళల్లో ముస్లింలను టార్గెట్ చేస్తు ఎన్నో వివాదాలు రేగాయి. వాటిల్లో హిజాబ్ ధరించటం, హలాల్ కట్, అంజాన్, పీఎఫ్ఐ నిషేధం, గోవధ నిషేధ చట్టం, టిప్పుసుల్తాన్ వ్యవహారంతో రాష్ట్రంలో బాగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హిజాబ్ వివాదమైతే కర్నాటకలో పాకి దాదాపు దేశమంతా విస్తరించింది.

వీటన్నింటికీ అదనంగా ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ల రద్దు. దక్షిణ కన్నడ, బీదర్, కలబురగి, విజయపుర, రాయచూరు, ఉడిపి, హుబ్బళి-ధార్వాడ, శివమొగ్గ, తుముకూరు, చిక్ బళాపూర్, కోలార్ ప్రాంతాల్లోని నియోజకర్గాల్లో ముస్లింల ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. మరింతటి కీలకమైన ఓటుబ్యాంకును బీజేపీ ఎందుకు వద్దనుకుందో అర్ధంకావటంలేదు. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కూడా ముస్లింలకు బీజేపీ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అయినా ముస్లింలు ఓట్లేశారు. బహుశా ఆ ధైర్యంతోనే ఇపుడు కర్నాటకలో కూడా ముస్లింలకు టికెట్ ఇవ్వలేదేమో. మరి మే 13వ తేదీన రిజల్టు ఎలాగుంటుందో చూడాల్సిందే.