విజ‌న్‌కు ప‌ట్టం.. చంద్ర‌బాబు న‌మ్మ‌కం ఇదే!

రాజ‌కీయాల్లో మార్పులు స‌హ‌జం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా క‌నివినీ ఎరుగ‌ని విధంగా వైసీపీలో ముసలం పుడితే. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాత్రం విక‌సిత రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. ఇంకే ముంది.. మాకు తిరుగులేదు.. వైనాట్ 175 అని చెప్పిన వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆత్మ రక్ష‌ణ‌లో ప‌డిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయ‌న విధానాల‌ను తూర్పార‌బడుతున్నారు. క‌నీసం ఎమ్మెల్యేలకు ఎలాంటి విలువా లేకుండా చేయ‌డంపై వారు ప్ర‌శ్నిస్తున్నారు.

దీంతో వైసీపీలో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు మార‌తాయో.. అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. ఎన్నిక‌ల‌కు మరో ప‌ది మాసాలు మాత్రమే గ‌డువు ఉండ‌డంతో వైసీపీ నుంచి ఎప్పుడు ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌స్తారో తెలియని ఒక సందిగ్ధ పూరిత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇది.. వైసీపీని ముందుకు వెళ్ల‌కుండా.. బ్రేకులు వేసే ప‌రిస్తితిని తీసుకువ‌చ్చింది. మ‌రోవైపు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను చేప‌ల‌ను రుద్దిన‌ట్టు రుద్దేస్తున్నారు. గ‌డ‌పగ‌డ‌ప‌.. మా నమ్మ‌కం.. వంటి కార్య‌క్ర‌మాల‌తో వారిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయినా.. ఎక్క‌డో అప‌న‌మ్మ‌కం కొన‌సాగుతోంది.

ఇక‌, ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యానికి తోడు.. చంద్ర‌బాబు విజ‌న్‌కు ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మూడు రాజధానుల‌ను వ్య‌తిరేకిస్తున్న మెజారిటీ వ‌ర్గం.. ఇప్పుడు మ‌రోసారి టీడీపీకి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇక‌, పొత్తుల విష‌యం ఎలా ఉన్నా.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు చంద్ర‌బాబు.

దీంతో చేరిక‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది. అధికార పక్షంపై ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కం కూడా స‌న్నగిల్లుతోంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఒక‌వైపు ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌కుండా.. సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు పందేరం చేయ‌డాన్ని ఉద్యోగులు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ఏడాది పొడ‌వునా పంప‌కాల‌కే ప్రాధాన్యం ఇస్తామంటే ఎలా.. అనేది ప్ర‌శ్న‌. ఇలాంటివే వైసీపీ ప్ర‌జ‌ల‌కు దూరం చేస్తుంటే.. చంద్ర‌బాబు విజ‌న్‌.. టీడీపీ విజ‌యం రెండూ కూడా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాయి.