పొత్తును ఎందుకు వద్దనాలి.. టీడీపీ కార్యకర్తల మనోగతం

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై చర్చ మళ్లీ ఊపందుకున్న నేపథ్యంలో పార్టీల కార్యకర్తలు కూడా ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తున్నారు. నిన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో చంద్రబాబు సానుకూల సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కూడా జోష్‌ మీదకు వచ్చాయి. టీవీ చర్చల్లో పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా, కార్యకర్తలు కూడా వారికి వంత పాడుతున్నారు. మోదీని మాత్రమే చంద్రబాబు పొడిగారని, పొత్తుపై కమిట్మెంట్ ఇవ్వలేదని టీడీపీ వ్యతిరేక మీడియా ప్రచారం చేయడం కరెక్టు కాదని, ఏ విషయాన్నైనా ఆయన తన ధోరణిలోనే చెబుతారని నిన్న కూడా అదే జరిగిందని కార్యకర్తలు అంటున్నారు.

ఆర్థికరంగంలో తన అభిప్రాయాలు చెప్పడానికి పిలిచిన రిపబ్లిక్ టీవీ.. ఆయన్ను పొత్తులపై కూడా ప్రశ్నించిందని వాళ్లు గుర్తుచేస్తున్నారు. వాళ్ల ట్రాప్‌లో పడి పొత్తులపై పూర్తి క్లారిటీ ఇస్తే రిపబ్లిక్ టీవీలో తాను ఇవ్వాలనుకున్న సందేశం దారి తప్పుతుందని చంద్రబాబు భావించారని, అయితే పొత్తులకు టీడీపీ సిద్ధంగా ఉందని సందేశం అర్థం చేసుకోవాల్సిన వాళ్లకు చేరిందని వారు వాదిస్తున్నారు..

బీజేపీతో స్నేహంగా ఉన్నప్పుడు టీడీపీకి పూర్తి లబ్ధి పొందిందని పార్టీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. వాజ్‌పేయి హయాంలోనైనా, మోదీ పాలన మొదటి అంకంలోనైనా కమలం పార్టీతో మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబు చక్రం తిప్పారు. కేవలం ప్రత్యేక హోదాపై విభేదాల కారణంగానే చంద్రబాబు, బీజేపీకి దూరం జరగాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. బాబు కూడా రిపబ్లిక్ టీవీ చర్చలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కార్యకర్తల ఆలోచనా విధానాన్ని బలపరిచారు. అంతకు మించి బీజేపీతో తమకు విభేదాలు లేవని వారి వాదన..

గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక శాతానికి మించి ఓట్లు రాలేదని, జనసేనకు ఆరు శాతం వచ్చాయని కొందరు కార్యకర్తలు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో సైతం అదే స్థాయిలో వారికి ఓట్లు వచ్చినా పొత్తులో అది ప్రయోజనకరంగా ఉంటుందని అందరు కలిసి వైసీపీని ఓడించేందుకు అవకాశం వస్తుందని కార్యకర్తల ఆలోచన. పైగా జగన్‌కు బీజేపీ పరోక్ష మద్దతు ప్రకటించకుండా ఉండాలంటే కమలం పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడమే సరైన మార్గమని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి సర్వేలు సైతం కేంద్రంలో బీజేపీ గెలుస్తోందని చెప్పడంతో ఢిల్లీ పార్టీతో మంచిగా ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. తమ ఆలోచన అధినేత చంద్రబాబుకు తెలుసని దాన్ని ఆయన ఆమోదిస్తారని కార్యకర్తలు వాదిస్తున్నారు….