నితీష్ ప్రయత్నాలు ఫలిస్తాయా ?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించాలని నాన్ ఎన్డీయేలోని అన్నీ పార్టీల్లో బలంగా ఉంది. అయితే అందుకు తగ్గట్లుగా కార్యాచరణే సాధ్యం కావటంలేదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా త్యాగాలకు సిద్ధంగా లేదు కాబట్టే. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ తో కలవటానికి కొన్ని ప్రాంతీయపార్టీలు సిద్ధంగా లేవు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నం సాధ్యంకాదు. ఇక్కడే చెట్టు ముందు విత్తు ముందా అనే ప్రశ్నలాగ ప్రతిపక్షాల పరిస్ధితి తయారైంది.

కాంగ్రెస్ తో చేతులు కలపటానికి సిద్ధపడితే నాయకత్వ బాధ్యతలు, ప్రధానమంత్రి అభ్యర్ధి కూడా కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలి. నాయకత్వ బాధ్యతలను, ప్రధానమంత్రి అభ్యర్ధి అవకాశాన్ని వదులుకోవటానికి ప్రాంతీయపార్టీల అధినేతల్లో కొందరు అంగీకరించటంలేదు. ఇక్కడే సమస్య పెరిగిపోతోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ వ్యతిరేక ప్రయత్నాలను బాగా స్పీడుపెంచారు. ప్రయత్నాలను ప్రారంభించే ముందు నితీష్ చేసిన ప్రకటన ఏమిటంటే తాను నాయకత్వాన్ని కోరుకోవటంలేదని.

అలాగే తనకు ప్రధానమంత్రి పీఠంపై ఆశలు లేవని కూడా ప్రకటించారు. కాబట్టి నితీష్ ప్రయత్నాలను సంకించాల్సిన అవసరంలేదు. అయితే బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తెలంగాణా సీఎం కేసీయార్ వ్యవహారం ఏమిటి ? అలాగే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాటేమిటి ? కర్నాటకలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ సంగతేంటి ? అవకాశం వస్తే బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించాలని అందరు ఆశపడుతున్న వాళ్ళే. ఛాన్సు వస్తే ప్రధానమంత్రి అయిపోదామని బలంగా కోరుకుంటున్నారు.

నాయకత్వాన్ని, ప్రధానమంత్రి అభ్యర్ధిత్వాన్ని త్యాగం చిసినపుడు మాత్రమే ప్రతిపక్షాల కూటమి సాధ్యమవుతుంది. నితీష్ సోమవారం ఉదయం బెంగాల్ సీఎం మమతబెనర్జీతో సమావేశమయ్యారు. సాయంత్రానికి లక్నోలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కూడా భేటీ అయ్యారు. నితీష్ ప్రయత్నాల్లో చిత్తశుద్ది ఉందని అనుకున్నా మిగిలిన నేతలనే నమ్మేందుకు లేదు. శరద్ పవార్ నే తీసుకుంటే ఒకరోజు ప్రతిపక్షాలతో సమావేశమవుతారు. మరుసటి రోజు బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతారు. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని నితీష్ ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏమిటి ఉపయోగం ?