కాంగ్రెస్ ను దెబ్బకొడుతున్న ‘లీక్స్’

ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా తెలంగాణా కాంగ్రెస్ ను లీకుల సమస్య వదలటంలేదు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా ప్రస్తావించారు. అయితే ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు బయటకు పొక్కకుండా ఆపలేకపోతున్నారట.  అంతర్గత విషయాలు, చర్చలు బయటకు ఎలా వెళుతున్నాయన్ని తెలుసుకునేందుకు పీసీసీ పెద్ద కసరత్తే చేస్తోంది. అయినా పెద్దగా ఉపయోగం కనబడటంలేదట.

లీకులకు రెండు మార్గాలున్నట్లు రేవంత్ తదితరులు నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే మొదటిదేమో పార్టీలోని నేతలే కావాలని ఇతర పార్టీలకు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు చేరవేయటం. ఇక రెండో పద్దతి ఏమిటంటే గతంలోనే పార్టీకి దూరమైన నేతలు తమకున్న పరిచయాల ద్వారా పార్టీ నేతల నుండి సమాచారాన్ని లాక్కోవటం. రెండింట్లో పద్దతి ఏదైనా విషయాలు లీకవుతున్నాయన్నది కీలకమైన పాయింట్. లీకులను కంట్రోల్ చేయాలంటే ముందుగా కోవర్టులను ఏరిపారేయాలి. కాంగ్రెస్ పార్టీలో అది జరిగే పనికాదు.

అందుకనే ఏమిచేయాలో అర్ధంకాక రేవంత్ తలపట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పై ఇద్దరితో రేవంత్ మాట్లాడారు. ఈ విషయాలు కూడా బయటకు పొక్కాయట. అలాగే బీఆర్ఎస్ లోని అసంతృప్తుల్లోని కొందరితో రేవంత్ మాట్లాడిన విషయాలు కూడా లీకవుతున్నట్లు గుర్తించారు.

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో ఇలాంటి రహస్యమంతనాలు కూడా బయటకు వెళిపోతే పార్టీపై  పెద్ద దెబ్బపడుతుందని రేవంత్ టెన్షన్ పడుతున్నారట. కానీ ఏమిచేయాలో అర్ధంకాని పరిస్ధితి. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా చేరవేసిట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలపై వేటు వేసేదెవరు ? దాన్ని ఆమోదించేదెవరు ? పార్టీలో ఉన్నంత సంపూర్ణ స్వాతంత్ర్యం మరేపార్టీలోను ఉండదు. అందుకనే ఎవరినీ ఎవరు కంట్రోల్ చేయలేరు. ఏదో అప్పుడప్పుడు తాను ఉన్నానని చెప్పుకునేందుకు అధిష్టానం కాస్త గర్జిస్తుంటుంది. నేతలు కూడా భయపడినట్లు నటిస్తారు. నాలుగురోజులు పోయిన తర్వాత అంతా మళ్ళీ మామూలే.