చంద్ర‌బాబు ఇమేజ్‌ను పెంచేస్తున్న వైసీపీ వ్యూహాలు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు విజ‌న్ ఉన్న నాయ‌కుడు అనే ఇమేజ్ ఉంది. ఇది చెరిపేస్తే చెరిగేలా లేదు. ఆయ‌న అంత బ‌లంగా పునాదులు వేసుకున్నారు. అయితే.. దీనిని ఖ‌రాబు చేయాల‌ని.. చంద్ర‌బా బుకు ఇమేజ్ లేద‌ని చాటి చెప్పాల‌ని ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ప‌రిశీలకులు చెబుతున్నారు. అందుకే త‌ర‌చుగా అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకుని ఇక్క‌డ సినిమా చూపించారు త‌ప్ప ఏమీలేద‌నే విమ‌ర్శ‌లు చేస్తూ వచ్చారు.

అయితే.. తాజాగా అమ‌రావ‌తి విష‌యం జాతీయ‌స్థాయిలోనూ మంచి పేరు తెచ్చుకోవ‌డం.. ఇటీవ‌ల హైద‌రాబాద్ కొన్ని విష‌యాల్లో(రియ‌ల్ ఎస్టేట్‌.. పెట్టుబ‌డులు.. ఉపాధి క‌ల్ప‌న‌) ముందుండ‌డంతో అమ‌రావ‌తి పుంజుకుని ఉంటే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని.. తెలంగాణ మంత్రులే బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డంతో చంద్ర‌బాబు ఇమేజ్ మ‌రింత పెరిగింది. ఇది వైసీపీ ఇచ్చిన అవ‌కాశ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అస‌లు అమ‌రావ‌తిని త‌న‌దైన ప‌ద్ధ‌తిలో మ‌రింత మెరుగులు దిద్ది.. జ‌గ‌న్ అభివృద్ధి చేసి ఉంటే.. నిజంగానే చంద్ర‌బాబు ఇమేజ్ ఏమై ఉండేదో!? ఇక‌, చంద్ర‌బాబు ఎక్క‌డ ప‌ర్య‌టించినా .. అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వ‌డం.. కేసులు పెట్ట‌డం.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధించ‌డం ప‌రిపాటిగా మారింది. ఇది కూడా చంద్ర‌బాబుకు సానుభూతి ప‌వ‌నాలు వ‌చ్చేలా చేసింది.

మ‌రోవైపు.. చంద్ర‌బాబు హయాంలో ఉన్న రంజాన్ తోఫాను ర‌ద్దు చేయ‌డం.. అన్నా క్యాంటీన్ల‌ను తీసేయ‌డం కూడా.. వైసీపీకి మైన‌స్ కాగా..(ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్‌గా మారాయి) టీడీపీకి ప్ల‌స్ అయ్యాయి. దీంతో వైసీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌త‌య్నాల‌తో అనూహ్యంగా చంద్ర‌బాబు ఇమేజ్ మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు. దీనికి తోడు చంద్ర‌బాబు వృద్ధుడు అని చేస్తున్న ప్ర‌చారాన్ని మెజారిటీ ప్ర‌జ‌లు తిర‌స్కరిస్తుండ‌డం గ‌మ‌నార్హం.