అమ‌రావ‌తిలో మ‌రో ర‌గ‌డ‌.. రంగంలోకి రైతులు.. ఏం జ‌రిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఎలానూ చేయ‌డం లేదు. అంతేకాదు.. క‌నీసం అమ‌రావ‌తి ఊసు కూడా ఎత్త‌డం లేదు. రాజధాని లేద‌న్న విమ‌ర్శ‌ల‌ను కూడా అధికార పార్టీ పాల‌కులు లైట్ తీసుకున్నారు. కానీ, రైతులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూనేఉన్నారు. ప్ర‌స్తుతం అమ‌రావ‌తి వివాదం ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులో ఉంది. ఇంత‌లోనే రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల ప్ర‌జ‌ల‌కు.. ఇక్క‌డ జ‌గ‌న‌న్న ఇళ్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం దూకుడు ప్ర‌ద‌ర్శించింది.

ఈ క్ర‌మంలోనే ఆర్ – 5 జోన్ అని ఒక దానిని క్రియేట్ చేసింది. ఇక్క‌డ అమ‌రావ‌తి యేత‌ర ప్రాంతాల‌కు చెందిన పేద‌ల‌కు సెంటు భూమిని ఇవ్వాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. దీనిని కూడా రైతులు వ్య‌తిరేకి స్తున్నారు. తాము రాజ‌ధానికే ఇచ్చామ‌ని.. వేరేవారికి ఇచ్చేందుకుకాద‌ని వారు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం త‌న‌ప‌నితాను చేసుకుపోతోంది. దీంతో రైతులు.. ఈ విష‌యంపైనా హైకోర్టులో నాలుగు రోజుల కింద‌ట కేసు దాఖ‌లు చేశారు.

దీనిపై ఇంకా తీర్పు రాలేదు. ఇంత‌లోనే ప్ర‌భుత్వం.. రాజధాని ప్రాంతంలోని ఆర్ – 5 జోన్లో ఉన్న అట‌వీ భూముల‌ను శుభ్రం చేసే ప‌ని చేప‌ట్టింది. ఈ విష‌యం తెలుసుకున్న రైతులు ఆయా ప‌నుల‌ను అడ్డుకున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలలోని పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇచ్చేందుకు ఆర్ 5 జోన్లో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన కృష్ణాయపాలెం చేరుకున్నారు. జేసీబీలను, అధికారులను.. రైతులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి జేసీబీలను వెనక్కి పంపించారు.

ఆర్ – 5 జోన్ అనే అంశం హైకోర్టులో ఉండగా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని రైతులు ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డి వ్యవహారంపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని రైతులు చెప్పారు. ఎక్కడో ఉన్న పేదలను ఇక్కడకి తీసుకొచ్చి.. ఇక్కడ ఉన్న వారితో గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసమే భూములు ఇచ్చామ‌న్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్త‌త నెల‌కొంది.