‘ఒక బాబాయి హ‌త్య‌.. మ‌రో బాబాయి జైలుకు’

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి టీడీపీ యువ‌నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక బాబాయి(వివేకా) హ‌త్య కేసులో మ‌రో బాబాయి(వైఎస్ భాస్క‌ర‌రెడ్డి) జైలు వెళ్లార‌ని.. ఇదంతా ఏంటి జ‌గ‌నూ అంటూ స‌టైర్లు కుమ్మ‌రించారు. జగన్‌ అండ్‌ కో డ్రామా కంపెనీ ఆడిన నాటకాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు. చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని కొత్త ఎత్తులు వేసిన లాభం లేదన్నారు.

తండ్రి బాటలోనే తనయుడు జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ అవినాష్‌రెడ్డిని ఉద్దేశించి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సీబీఐ దెబ్బకు సీఎం జగన్ పర్యటనలు సైతం రద్దు చేసుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నా రని విమర్శించారు. “వివేకాను ఒప్పిస్తే అవినాష్ ఎంపీ అవుతాడు కానీ.. చంపేస్తే నేరస్తులు అవుతారన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్” అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ డ్రామా ట్రూప్కి వచ్చే ఐడియాలు డెకాయిట్లకు కూడా రావన్నారు.

ముందు బాబాయ్ని చంపేసారని.. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని చంపేస్తున్నారని నారా లోకేష్‌ ధ్వజమె త్తారు. జగన్ డ్రామా ట్రూప్ ఎంత డేంజరో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణే చాలని.. అందుకే ఇది “జగనాసుర రక్త చరిత్ర” అంటూ విమర్శించారు. నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్.. ఇప్పుడు సీబీఐ కొట్టిన దెబ్బకి పర్యటనలు రద్దు చేసుకొని త‌న‌కు త‌నే వెంట్రుకలు పీక్కుంటున్నాడన్నారు. రాయలసీమ బిడ్డ కాదని.. ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ విమర్శలు గుప్పించారు.