ఖ‌జానా ఖాళీ.. చేతులెత్తేసిన ఏపీ ప్ర‌భుత్వం!

ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన సంద‌ర్భాలు లేవు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న అస్సాం, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలు కూడా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ, తొలి సారి 75 సంవ‌త్స‌రాల భార‌త దేశ చ‌రిత్ర‌లో ఏపీ ప్ర‌భుత్వం స్వ‌యంగా ఖ‌జానా ఖాళీ అయిందని ప్ర‌క‌టించి.. సంచ‌ల‌నం రేపింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ చెప్పారు.

ఈ నెల‌లో షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు వసతి దీవెన పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే.. దీనిని వాయిదా వేసింది. ఇదే విష‌యాన్ని చెప్పేందుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తొలిసారి మీడియా మీటింగ్ పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏప్రిల్‌ నెలలో ఆదాయ వనరుల సమస్యలు ఉంటాయని.. ఆశించిన మొత్తాలు రాకపోవడం వల్ల షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని జవహర్‌రెడ్డి వెల్లడించారు.

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక లోటు సమస్యలుంటాయని, అయితే రానున్న రోజుల్లో సంక్షేమ క్యాలెండర్‌ అమలుకు నిధుల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా.. కష్టపడి అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి కూడా ప‌దే ప‌దే చెబుతున్నారు.

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బుల్లేవు.. అందుకే వసతి దీవెన పథకం వాయిదా వేస్తున్నామని అధికారికంగా ప్రకటించడం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్లను తెచ్చుకోకపోగా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సు అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. కానీ, కేంద్రం అడ్వాన్స్ అప్పులు ఇచ్చేందుకు విముఖ త వ్య‌క్తం చేసింది. దీంతో ఖ‌జానా ఖాళీ అయింద‌ని ప్ర‌క‌టించిన‌ట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మ‌రో 10 రోజులు ఇదే ప‌రిస్థితి ఉంటే..ఏపీలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విధించినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.