నిన్న సాక్షి.. నేడు నిందితుడు.. ఎంపీ అవినాష్‌కు బిగిస్తున్న ఉచ్చు!

వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో నిన్నటి వ‌ర‌కు సీబీఐ అధికారులు సాక్షిగా పేర్కొన్న క‌డ‌ప ఎంపీ.. అవినాష్ రెడ్డిని తాజాగా స‌హ నిందితుడిగా పేర్కొంటూ.. కోర్టుకు స‌మ‌ర్పించే చార్జిషీట్‌లో సంచ‌ల‌న మా ర్పులు చేశారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో టెన్ష‌న్ పూరిత వాతావ‌ర‌ణం పెరిగిపోయింది. ఇదిలావుంటే.. ఈ మార్పులు చేసిన రోజే అంటే.. సోమ‌వారమే.. ఎంపీ అవినాష్ రెడ్డిని విచార‌ణ‌కు పిల‌వ‌డం మ‌రింతగా ఉత్కంఠ‌ను పెంచేసింది.

ఇప్ప‌టికే నాలుగు సార్లు అవినాష్‌ను సీబీఐ విచారించింది. ఇక‌, ఇప్పుడు ఐదోసారి ఆయ‌న‌ను కోఠిలోని సీబీఐ కార్యాల‌యంలో విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించింది. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమ‌వారం తెల్లవారుజామున పులివెందుల నుంచి బయలుదేరి వెళ్లారు. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన నివాసం నుంచి బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా హైదరాబాద్ వెళ్లారు.

ఆయన వాహనాన్ని అనుసరిస్తూ వైసీపీ నాయకులు భారీగా వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. సోమ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయ‌న‌ను విచారించ‌నున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు విచార‌ణ‌ల మాదిరిగా ఇది ఉంటే.. వైసీపీలో పెద్ద స‌మ‌స్య టెన్ష‌న్ ఉండేదికాదు. కానీ, ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డి అరెస్టు విచార‌ణ త‌ర్వాతే ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది.

ఈ క్ర‌మంలోనే ఉరుములు లేని పిడుగు మాదిరిగా వైఎస్ భాస్క‌ర‌రెడ్డిని అరెస్టు చేయ‌డం, అనంత‌రం.. ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించ‌డం జ‌రిగాయి. ఇక‌, ఇప్పుడు అవినాష్‌ను సాక్షి నుంచి స‌హ‌నిందితుడిగా మార్చ‌డం.. ఆ వెంట‌నే విచార‌ణ‌కు పిలవ‌డం.. వంటివి మ‌ధ్యాహ్నం 3 త‌ర్వాత ఏమైనా జ‌ర‌గొచ్చు..అ నే చ‌ర్చకు తెర‌దీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఒక‌వైపు ఉత్కంఠ , మ‌రోవైపు చ‌ర్చ‌ల్లో మునిగిపోయారు.