చంచ‌ల్ గూడ జైలుకు వైఎస్ భాస్క‌ర‌రెడ్డి.. రిమాండ్ ఎన్ని రోజులంటే!

తెలుగు రాష్ట్రాల‌ను తీవ్ర‌స్థాయిలో కుదిపేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి దారుణ‌ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అధికారులు హైద‌రాబాద్‌లోని చంచ‌ల‌గూడ జైలుకు త‌ర‌లించారు. దీనికి ముందు భాస్క‌ర‌రెడ్డిని నాంప‌ల్లిలోని సీబీఐ మేజిస్ట్రేట్ కోర్టుకు అధికారులు త‌ర‌లించారు. అయితే.. ఆదివారం కావ‌డంతో మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన న్యాయ‌మూర్తి భాస్కర్ రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

తొలుత ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అనంతరం రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువ‌రించారు. అయితే.. భాస్క‌ర‌రెడ్డిని విచారించాల్సి ఉంద‌ని త‌మ కస్టడీ ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరారు. కానీ, దీనికి ప్ర‌త్యేకంగా పిటిష‌న్ వేసుకోవాల‌ని న్యాయ‌మూర్తి పేర్కొన‌డంతో సీబీఐ సోమ‌వారం పిటిష‌న్ వేసేందుకు అంగీక‌రించింది. మ‌రోవైపు భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది నాగార్జున రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుంటే, పులివెందుల‌లో అరెస్టు అనంత‌రం.. భాస్క‌ర‌రెడ్డిని హైద‌రాబాద్‌కు త‌రలించిన సీబీఐ అధికారులు ఉస్మానియా ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయించారు.

ఈ స‌మ‌యంలో వైఎస్ భాస్కర్‌రెడ్డికి ర‌క్త‌పోటు పెరిగింది. బీపీ 170గా ఉండటంతో వైద్య పరీక్షలు ముమ్మ‌రం చేవారు. భాస్కర్ రెడ్డికి సెలైన్ ఎక్కించి చికిత్స అందించారు. మరోవైపు టుడి ఎకో పరీక్ష కూడా చేసినట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తరలించారు. మెడికల్ రిపోర్టును సీబీఐ అధికారులు మేజిస్ట్రేట్ కు అందించారు. అనంత‌రం భాస్క‌ర‌రెడ్డిని 14 రోజుల రిమాండ్‌కు త‌ర‌లిస్తూ.. న్యాయ‌మూర్తి తీర్పు వెలువ‌రించారు.