హు కిల్డ్ బాబాయ్‌! 48 గంట‌ల్లో మ‌రో అరెస్టు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర రెడ్డిని సీబీఐ అరెస్టు చేయ‌డం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాలపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ స‌టైరిక‌ల్‌గా స్పందించారు. ‘సీబీఐ జోరు మా పార్టీ వైసీపీ బేజారు.. హూ కిల్డ్‌ బాబాయ్’ అని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. అంతేకాదు.. 48 గంట‌ల్లో మ‌రో అరెస్టు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తేల్చి చెప్పారు. అది మ‌రింత‌గా త‌మ పార్టీకి షాక్ ఇవ్వ‌బోతోంద‌ని వ్యాఖ్యానించారు.

వివేకానంద‌రెడ్డిని హత్యచేసి గుండెపోటు అన్నారు.. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ఫ్రీజర్‌లో పెట్టి రక్తం కనిపించకుండా పూలను సైతం ఏర్పాటు చేశారు అని రఘురామ అన్నారు. సునీత రెడ్డి భర్త చాలా స్పష్టంగా ఏపీ పోలీసులకు, సీఐడీ అధికా రులకు స్టేట్‌మెంట్ ఇచ్చారని, ఏదో డైవర్ట్ చేస్తున్నారని అదే రోజు అనుమానం వ్యక్తం చేశారన్నారు. సునీత రెడ్డి వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలని ఆయన కోరిన‌ట్టు ర‌ఘురామ చెప్పారు. గొడ్డలితో హత్య చేసిన వారిని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు.

వివేకా కేసులో మరిన్ని ఆధారాలతో హత్యకు ముందు ఎవరెవరు కలిశారో, ఎక్కడ కలిశారన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. గూగుల్ టెక్ ఔట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని స్పష్టంగా తేలిపోయిందన్నారు. ర‌క్తాన్ని తుడిచేసిన గ‌జ్జ‌ల‌ ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. భాస్కర్ రెడ్డి స్వయంగా భారతి రెడ్డికి మేనమామ అని గుర్తు చేశారు.

క‌డ‌ప ఎంపీ సీటు ఎలాగూ అవినాష్ రెడ్డికి కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చంపడం అని రఘురామ ప్రశ్నించారు. ఈ హత్య కేసును టీడీపీ నేతలు బిటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి మీదకు నెట్టివేయాలని చూశారు.. కానీ వాళ్లు సీబీఐ విచారణకు అడిగారని దీంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌మ పార్టీ నేత‌కు త‌ప్ప‌లేద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. భాస్కర్ రెడ్డి అరెస్టుతో సజ్జల రామకృష్ణారెడ్డి షాక్‌కు గురై ఉంటారని.. ఆర్ ఆర్ ఆర్ చెప్పారు.

సోమ‌వారం హైకోర్టులో జస్టిస్ సురేంద్ర ధర్మాసనం ముందు సునీత రెడ్డి తరపు వాదనలు ఉన్నాయని.. ఇది ఆమె విజయమన్నారు. నిజ దోషులు ఎవరన్నది సునీత రెడ్డికి తెలుసునని అన్నారు. ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళి తండ్రి రుణం తీర్చుకోవాలని.. ఆమె పోరాటం మహిళ లోకానికి ఆదర్శమని ఆర్ ఆర్ ఆర్ కొనియాడారు.