తండ్రి అరెస్టు.. కొడుకు ప‌రిస్థితి ఏంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఆది నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ.. సీఎం జ‌గ‌న్ త‌న‌కు త‌మ్ముడు అని చెప్పుకొనే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. పులివెందుల‌లోని ఆయ‌న ఇంటికి అత్యంత ర‌హ‌స్యంగా వెళ్లిన అధికారులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

అయితే.. తండ్రి అరెస్టుతో కొడుకు ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. రెండు రోజుల క్రితం అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన గ‌జ్జ‌ల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్ను అరెస్టు చేయగా.. హైదరాబాదులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

వివేకా హత్య జరిగిన స్థలంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో ఇతర నిందితులతో కలిసి గ‌జ్జ‌ల ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన ఉదయ్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది. దర్యాప్తుకు సహకరించటం లేదని.. పలుమార్లు విచారించిన తెలిసిన వాస్తవాలపై మాట మారుస్తున్నారని, అంతేకాకుండా దాట వేసే సమాధానాలిస్తు న్నారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తు కొనసాగించాలంటే 10 రోజుల కస్టడీ అవసరమని సీబీఐ కోర్టును అభ్యర్థించింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా అవినాష్‌రెడ్డి తండ్రిని అరెస్టు చేయ‌డంతో ఇక‌, మిగిలిన ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌నే వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త నెల రోజులుగా అవినాష్ అరెస్టు ఖాయ‌మంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆయ‌న త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. దీనిని హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌లేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.