గ్యాంగ్ స్టర్ హత్య..పండగ చేసుకుంటున్న జనాలు

ఉత్తరప్రదేశ్ లో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. ఎన్ కౌంటర్లో కొడుకు చనిపోయిన మూడురోజులకే తండ్రి, తండ్రితో పాటు బాబాయ్ కూడా హత్యకు గురవ్వటం యూపీలో సంచలనంగా మారింది. అతీక్ సుమారు 100కు పైగా కేసుల్లో నిందితుడు. పదులసంఖ్యలో కేసులు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతోంది. మామూలుగా అయితే ఈ కేసుల విచారణ ఎప్పటికీ పూర్తికావని అందరికీ తెలిసిందే.

ఒక్కో కేసు విచారణకే సంవత్సరాలు పడుతుంటే ఇక వంద కేసుల విచారణ ఎప్పటికి పూర్తవ్వాలి ? ఎప్పటికి కోర్టులు తీర్పివ్వాలి. విషయం ఏమిటంటే ఓ కేసులో జైలులో ఉన్న అతీక్ ను పోలీసులు ప్రయాగ్ రాజ్ లోని కోర్టులో మూడురోజుల క్రితమే హాజరుపరచాల్సుంది. ఈ విషయం తెలుసుకున్న కొడుకు అసద్ తన ముఠాతో ప్లాన్ చేశాడు. తండ్రిని ఎలాగైనా పోలీసుల నుండి తప్పించాలని అనుకుని కోర్టుకు తీసుకెళుతున్న పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నంలో అసద్ ఎన్ కౌంటరైపోయాడు.

సరే మూడురోజుల తర్వాత అంటే శనివారం పోలీసులు అతీక్ ను మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళారు. విషయం తెలుసుకున్న ప్రత్యర్ధులు దారికాచి పోలీసులపై ఒక్కసారిగా దాడిచేశారు. ఈ దాడిలో అతీక్ తో పాటు తమ్ముడు అఫ్రష్ అహ్మద్ కూడా చనిపోయాడు. అతీక్ ప్రత్యర్ధుల దాడిలో పోలీసులకు కూడా గాయలయ్యాయి. మొత్తంమీద మూడురోజుల వ్యవధిలోనే కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, కొడుకు అసద్ మరణించటం యూపీలో సంచలనంగా మారింది.

మరణాల వెనుక కారణాలు ఏమైనా జనాలంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. అతీక్ మీద 100కు పైగా కేసులున్నాయంటేనే తన వల్ల ఎన్ని కుటుంబాలు ఎన్నిరకాలుగా నష్టపోయాయో అర్ధంచేసుకోవాలి. తమను అంతగా ఇబ్బందులుపెట్టిన అతీక్, అసద్ మరణించారంటే బాధిత కుటుంబాలు సంతోషంగా పండగ చేసుకోకుండా ఎలాగుంటాయి. ఇలాంటి లోకకంఠకులకు అండదండలు అందించిన అందిస్తున్న రాజకీయపార్టీలదే అసలు తప్పు. లేకపోతే ఇంతటి క్రూరమైన గ్యాంగ్ స్టర్ ఎంపీగా ఎలా గెలిచాడు ? జనాలు ఎలా ఓట్లేశారు ?