ప్రకాశం గరం..గరం..

జగనన్న పాలన భేషుగ్గా ఉందని వైసీపీలో కొందరు నేతలు బాకా ఊదుతుంటారు. కేడర్ ఐకమత్యంగా పనిచేస్తోందని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎక్కడా అసంతృప్తి లేదని, అందరూ సంతోషంగా ఉన్నారని ప్రకటనలిస్తుంటారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలపై ఆగ్రహంతో వైసీపీ కేడర్ ఊగిపోతోంది. ఇంఛార్జ్ గా ఉన్న వాళ్ల ఏకపక్ష ధోరణితో ఇబ్బంది పడుతున్నామని వెంటనే వాళ్లను మార్చేయ్యాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది….

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ క్యాడర్.. గత కొన్ని నెలలుగా పార్టీ లీడర్లపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తోంది. నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తున్న నాయకులు సొంత పార్టీ క్యాడర్‌నే వేధిస్తున్నారంటూ ఫిర్యాదులతో.. గత కొంత కాలంగా తాడేపల్లికి క్యూ కడుతున్నారు. అయితే ఫిర్యాదులు అందుకున్న తాడేపల్లి పెద్దల నుండి స్పందన లేకపోవడంతో నేరుగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదుటే ఆందోళనలు చేపడుతున్నారు. ఈ పరిస్థితి పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్యకి.. నియోజకవర్గ వైసీపీలో ఏర్పడిన మరో వర్గం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కృష్ణ చైతన్య చేతిలో నుంచి వైసీపీని కాపాడండి అంటూ… అద్దంకి వైసీపీ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కృష్ణ చైతన్యని అద్దంకి ఇంచార్జ్‌ పదవి నుండి తొలగించాలంటూ అసమ్మతి వర్గం చేస్తున్న ఆందోళనలు.. పలుమార్లు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తాకాయి. తండ్రి బాచిన చెంచు గరటయ్య వారసత్వంగా కృష్ణ చైతన్య రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో గరటయ్య ఓటమిపాలు కావడంతో నియోజక వర్గ ఇంచార్జ్ బాధ్యతలు కృష్ణ చైతన్యకి అప్పగించారు. ఏడాది కూడా తిరగకుండానే అద్దంకిలో కృష్ణ చైతన్యకి వ్యతిరేకంగా మరో వర్గం ఏర్పాటైంది. అద్దంకి వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో కృష్ణ చైతన్యకి వ్యతిరేకంగా పలు మార్లు తమ నిరసనలు తెలిపారు. అద్దంకి అసమ్మతి నేతలు తాడేపల్లి పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేయడం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.

కొండపిలో కూడా అద్దంకి పరిస్థితే కనిపిస్తోంది. గతంలో వైసీపీ నుండి సస్పెండ్ అయిన వరికూటి అశోక్ బాబుకి.. పది నెలల క్రితం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అప్పటి నుంచి ఆయన వ్యతిరేక వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. నియోజక వర్గంలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు అశోక్ బాబు పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారి ఇళ్లపై దాడులు అశోక్ బాబు పనేనని అనుమానిస్తూ, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లి కేంద్ర కార్యాలయం ఎదుట కూడా కొండపి అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధిష్టానం సీరియస్ గా రంగంలోకి దిగకపోతే చేయి దాటిపోయే ప్రమాదం ఉంది..