మోడీ స్థాయి అంతేన‌ని డిసైడ్ చేశారా?

తాజాగా హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. రాష్ట్రంలోని కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. అవినీతి, కుటుంబపాల‌న అంటూ.. కామెంట్లు కుమ్మ‌రించారు. స‌రే.. మ‌రి దీనికి కౌంట‌ర్‌గా.. సీఎం కేసీఆర్ కానీ, సీఎం స్థాయి వ్య‌క్తి కానీ, రియాక్ట్ కాలేదు. కేవ‌లం మంత్రి హ‌రీష్ చాల‌ని అనుకున్నారో.. ఏమో ఆయ‌న‌తోనే కౌంట‌ర్ ఇప్పించారు. బాల్క‌సుమ‌న్‌తో కొంత సేపు తిట్టించారు. ఇక‌, హ‌రీష్ రావు అయితే.. స‌రిపోతుంద‌ని లెక్క‌లు వేసుకుని.. ఆయ‌న‌నురంగంలోకి దింపిన‌ట్టు తెలుస్తోంది.

హ‌రీష్ రావు మాట్టాడుతూ.. మోడీ.. ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదని.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉందని ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్‌ సభలో ప్రధాని చెప్పిన ప్రతి మాట సత్య దూరంగానే ఉందని.. అన్ని అబద్ధాలు ఆడటం ఆయనకే చెల్లిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆసరా పింఛన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతున్నాయని అన్నారు.

మ‌మ్మ‌ల్ని కాపీ కొట్టారు!

ప్రధానమంత్రి తన వల్లే డీబీటీ మొదలైనట్లు చెప్పడం పచ్చి అబద్ధమని.. అందులో గొప్పగా చెప్పుకోవడానికి ఏముందని ఎద్దేవా చేశారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొడితేనే.. పీఎం కిసాన్‌ అయ్యిందని మంత్రి హ‌రీష్‌రావు గుర్తు చేశారు. పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకు లబ్ది జరుగుతుందని ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతుబంధుతో పోల్చితే.. పీఎం కిసాన్‌ ద్వారా ఎంత సాయం అందుతుందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

రైతుల కంట నీరుపెట్టించారు
తెలంగాణ ధాన్యాలను కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారని మోడీపై హ‌రీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు పనులు చేసింది.. మీ ప్రభుత్వం కాదా మోడీ గారు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే.. లేని పరివార వాదం గురించి మాట్లాడటం మీకే చెల్లిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని.. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తినే చెప్పడం హాస్యాస్పదమని.. నిజానికి ఈ పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అని ధ్వజమెత్తారు.

మీరే స‌హ‌క‌రించ‌లేదు
రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు.. మొండి చేయి చూపించిందని అన్నారు. కేంద్రం ఏ విషయంలోనూ రాష్ట్రానికి.. ఎలాంటి సహకారం అందించలేదని మంత్రి మండిపడ్డారు. మొత్తానికి కేసీఆర్ నోట రావాల్సిన మాట‌లు.. హ‌రీష్‌రావుతో చెప్పించార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.