బీజేపీ చేతిలో ‘కాంగ్రెస్ ఫైల్స్’

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ రెండు ప్రధాన కూటములు ఎన్డీయే-యూపీఏ మధ్య యుద్ధ వాతావరణం పెరిగిపోతోంది. నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. వీళ్ళని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా అంతే ధీటుగా అస్త్రాలను సిద్దం చేసుకున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో ఆదివారం ఒక వీడియోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ అంటే ఏమిటంటే యూపీఏ పదేళ్ళ పాలనలో జరిగిన అవినీతిని ఒక్కోదాన్ని విడుదల చేయటమే.

2జీ స్పెక్ట్రం వేలంలో అవినీతి, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన అవినీతి లాంటి అనేక అంశాలపై వీడియో ఆరోపణలను బీజేపీ సిద్ధం చేసుకున్నది. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే యూపీఏ హయాంలో 2జీ స్పెక్ట్రం వేలంలో అవినీతి అన్నది కట్టుకథగా తేలిపోయింది. ఆ కుంభకోణానికి సంబంధించి యూపీఏ హయాంలో బీజేపీ నానా గోలచేసింది. అయితే ఎన్డీయే అధికారంలోకి రాగానే అసలు కుంభకోణమే జరగలేదని కోర్టు తేల్చేసింది. వస్తుందని అనుకున్న ఆదాయం రాలేదంతే అని కోర్టు స్పష్టంచేసింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అప్పట్లో మంత్రి రాజాతో పాటు ఎంపీ కనిమొళిని యూపీఏ ప్రభుత్వం జైల్లో కూడా ఉంచింది.

ఇక బొగ్గు కుంభకోణంలో అప్పటి మంత్రి దాసరి నారాయణరావుపై విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. దానిపై విచారణ జరిగి చాలామందిని అరెస్టులు కూడా చేసింది యూపీఏ ప్రభుత్వం. ఇక కామన్వెల్త్ క్రీడల కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నా పెద్దగా ఆధారాలు లభించలేదు.

మరి వాటిపై ఇపుడు బీజేపీ ఏమని ఆరోపణలు చేస్తుంది ? వాటిని కాంగ్రెస్ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాల్సిందే. ఎందుకంటే యూపీఏ హయాంలో రు. 4.8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే మోడీ హయాంలో కార్పొరేట్ల రుణాలమాఫీ రూపంలో రు. 13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు యూపీఏ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వరంగ సంస్ధలను ప్రైవేటీకరణ పేరుతో అదానీతో పాటు కావాల్సిన సంస్ధలకు కట్టబెట్టేస్తున్నారనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. మొత్తానికి రెండు కూటముల మధ్య ఆరోపణల యుద్ధానికి తెరలేచిందనే చెప్పాలి. మరి జనాల తీర్పు ఎలాగుంటుందో.