కన్నా ఇంత యాక్టివ్ అయ్యారేందబ్బా…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్నారు. కన్నా టీడీపీలో చేరిన తర్వాత జిల్లా రాజకీయాలే మారిపోయాయి. ఆయనకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.. కన్నాను ఎక్కడ నుంచి పోటీ చేయించబోతున్నారు.. కన్నా గెలిస్తే మంత్రి పదవి ఇస్తారా.. లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కన్నా మాత్రం అవేమీ పట్టించుకోకుండా జిల్లాలో తన పూర్వ వైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

కన్నా రెండు వారాల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో ఆత్మీయ సమావేశం – మధ్యాహ్న భోజన మీటింగ్ నిర్వహించారు. ఆ భేటీకి దాదాపుగా జిల్లా టీడీపీ నేతలంతా వచ్చారు. కన్నాకు బద్ధశత్రువుగా భావించే రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. దానితో కన్నా అమితానందానికి లోనయ్యారు.

ఆత్మీయ సమావేశం తర్వాత కన్నా రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చాలా మంది టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు వచ్చి కన్నాను కలుస్తున్నారు. మరో పక్క ఆదివారం నాడు కన్నా స్వయంగా వైసీపీ నేత సయ్యద్ మాబు ఇంటికి వెళ్లి ఆయన్ను పలుకరించారు. మాబు ఒకప్పుడు మంత్రి అంబటి రాంబాబు అనుచరుడు. సత్తెనపల్లిలో అంబటి విజయం కోసం పనిచేసిన మాబును తర్వాత దూరం పెట్టారు. దానితో మనస్థాపానికి గురైన మాబు ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. కన్నా వెళ్లి ఆయన్ను కలవడంతో మాబు త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న టాక్ మొదలైంది గుంటూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో మైనార్టీ వర్గాలదీ డామినేషన్ కావడంతో అక్కడ టీడీపీని గెలిపించేందుకు కన్నా మాస్టర్ స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది…

తెనాలి మున్సిపల్ సమావేశంలో దాడికి గురైన టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ ను కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. పైగా నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా లాంటి సీనియర్లను వెంటబెట్టుకుని వెళ్లి మరీ యుగందర్ ను పలుకరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని కన్నా ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులపై తాము అధికారానికి వచ్చిన తర్వాత చర్యలుంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

కన్నా లేటుగా వచ్చినా టీడీపీలో లేటెస్టు లీడర్ అయిపోయారు. గుంటూరు జిల్లా పార్టీకి అన్నీ తానై పెద్ద దిక్కుగా వ్యవహరించేందుకు ఆయన వెనుకాడటం లేదు..