చంద్రబాబును ఆయన తప్పుబట్టడం కరెక్టేనా?

ఈ రోజు ఉదయం నుంచి తెలుగు మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జమ్మూ క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో విమర్శించారన్నదే ఆ వార్త. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తన సొంత ఎన్నికలు వదులుకొని మరీ ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తే.. తాము హౌజ్‌ అరెస్ట్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒమర్ విమర్శించారు.

ఐతే రాజకీయ అంశాల్లో ఎవరో ఒకరికి మద్దతుగానో, లేదంటే వ్యతిరేకంగానో వార్తల్ని ప్రెజెంట్ చేసే మీడియాలే తప్ప.. తటస్థంగా ఉండి, వివిధ అంశాల్ని తులనాత్మకంగా చూసే మీడియాలే కరవైపోయాయి మన దగ్గర. చంద్రబాబుపై ఒమర్ వ్యాఖ్యల విషయానికే వస్తే.. ఎన్నికలప్పుడు ఫరూక్ సాయం చేస్తే.. తాము హౌజ్ అరెస్ట్ అయినపుడు తమకు మద్దతుగా చంద్రబాబు మాట్లాడలేదన్న వ్యాఖ్య మాత్రమే చేశారు ఒమర్. కానీ ఓ వర్గం మీడియా మాత్రం చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ ఒమర్ విరుచుకుపడినట్లుగా పేర్కొంది. కొన్ని వ్యాఖ్యానాలు కూడా జోడించి దీన్ని సెన్సేషనలైజ్ చేసే ప్రయత్నం చేసింది.

ఇక ఒమర్, ఫరూక్‌లను హౌజ్ అరెస్ట్ చేసినపుడు వారికి మద్దతుగా మాట్లాడకపోవడం విషయానికి వస్తే.. ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిని ఆత్మరక్షణలో పడిపోయి, జగన్ సర్కారు ధాటికి తాళలేకపోతున్న ఆయన ఏ విషయంలో అయినా మోడీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసే స్థితిలో లేడన్నది వాస్తవం.

ఆ సంగతలా ఉంచితే.. దేశ ప్రయోజనాల్ని ఉద్దేశించి కేంద్రం ఆర్టికల్ 370, ఆర్టికల్‌ 35ఏలను రద్దు చేసే క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఒమర్ అబ్దుల్లా, ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతల్ని హౌజ్‌ అరెస్ట్ చేసింది. అది అనివార్యం. అలాంటపుడు తనకు సాయం చేశారని ఒమర్, ఫరూక్‌లకు అనుకూలంగా గళం విప్పితే చంద్రబాబు.. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడినట్లు అవుతుంది కదా? మరి చంద్రబాబు మౌనం వహించడం తప్పా?