చంద్రబాబు ప్రకటించిన దత్తత పథకం

పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబునాయుడు కొత్త పథకాన్ని ప్రకటించినట్లే ఉన్నారు. ఇంతకీ ఆ కొత్త పథకం పేరు ఏమిటంటే పేదల దత్తత పథకం. మేథావులు, ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నవారు, ఉన్నతస్ధాయిలో ఉన్నవారంతా తలా ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపిచ్చారు. సమాజంలో ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నట్లు చెప్పారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

పేదలు మరింత పేదరికంలో మగ్గిపోకూడదంటే అందుకు సంపన్నులు, మేథావులే నడుం బిగించాలని సూచించారు. ఆర్ధిక సంస్కరణలు, నాలెడ్జీ ఎకానమితో సమాజంలో సంపద బాగా వృద్ధి చెందుతున్నట్లు చంద్రబాబు వివరించారు. అయితే ఆ సంపద మొత్తం కేవలం కొంతమంది దగ్గర మాత్రమే పోగుపడుతున్నట్లు ఆవేధన వ్యక్తంచేశారు.  12 శాతం కుటుంబాలకు రోజుకు రు. 150 మాత్రమే అందుతున్నదట. 22 శాతం కుటుంబాలకు రోజుకు 350 రూపాయలు మాత్రమే అందుతోందన్నారు.

ఇక సంపన్నుల విషయాన్ని తీసుకుంటే సమాజంలో కేవలం 1 శాతం జనాభా మాత్రం 52 శాతం సంపదను అనుభవిస్తున్నారట. 34 శాతం జనాభా పేదరికంలో మగ్గుతుంటే 1 శాతం జనాభా 52 శాతం సంపదను అనుభవిస్తుండటం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఐదేళ్ళల్లో కొందరి ఆదాయం 100 రెట్లు పెరుగుతుంటే పేదల ఆదాయం మాత్రం మూడు రెట్లే పెరుగుతోందట. పేదల ఆదాయం 40 రెట్లు పెంచే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని ప్రకటించారు.

తెలుగురాష్ట్రాల్లోని 10 కోట్లమంది జనాభాలో కనీసం 4 కోట్లమంది పేదరికంలోనే మగ్గుతున్నట్లు చంద్రబాబు ఆవేధన వ్యక్తంచేశారు. సమాజంలో పేదరిక నిర్మూలనకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటం చారిత్రక అవసరంగా చంద్రబాబు పిలుపిచ్చారు. అందుకనే శక్తున్న వాళ్ళు తలా పది కుటుంబాలను దత్తత తీసుకోవాలని, వాళ్ళ ఆర్ధికాభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు చెప్పారు. మరీ దత్తత పథకం ఎప్పటినుండి అమల్లోకి వస్తుంది ? చంద్రబాబుతో సహా ఎంతమంది తమ్ముళ్ళు ఎంతమందిని దత్తత తీసుకుంటారో చూడాలి.