మోదీ మొహం చాటేశారా?

ఏపీ సీఎం జగన్ పక్షంరోజుల్లో రెండో సారి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈ సారి అలా వెళ్లి ఇలా వచ్చారు. కేవలం అమిత్ షా ను కలిసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా కనిపిస్తోంది. మొత్తం 13 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో అమిత్ షా కు జగన్ సమర్ఫించారు. జగన్ చేసిన విన్నపాల్లో చాలా వరకు పాతవే ఉన్నాయి. పోలవరం ప్రాజెకుకు సంబంధించిన డిమాండ్లలో కేంద్ర సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదు.

ఇవ్వాల్సిన నిధులు ఎప్పుడో ఇచ్చామని కేంద్రం చెబుతూ వస్తోంది. రిసోర్స్ గ్యాప్ ఫండ్ కింద ప్రభుత్వం అడుగుతున్న రూ. 36,625 కోట్లు కూడా వచ్చే అవకాశమే లేదు. విద్యుత్ బకాయిల వసూలు, విభజన హామీల అమలు అంత ఈజీగా జరిగే పని కాదని కూడా జగన్ కు తెలుసు. ఏపీ సీఎం మరో సారి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. హోదాతోనే రాయితీలు లభిస్తాయని ఆయన గుర్తు చేశారు.

సీఎం ఢిల్లీ వెళ్తున్నప్పుడే ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటించింది. అయినా ఆశ చావలేదన్నట్లుగా జగన్ మళ్లీ అదే డిమాండ్ చేర్చారు.
ఏది చేసినా చేయకపోయినా కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా అప్పులిస్తోంది. మార్చి నెలలో వరుసగా రెండు సార్లు అప్పు పుట్టింది. మహా అయితే ఏప్రిల్ మొదటి వారంలో మళ్లీ అప్పు దొరకొచ్చు. జీతాలు, పెన్షన్లకు సర్దుబాటు చేసే అవకాశం రావచ్చు. జగన్ ఢిల్లీ టూర్ పై రెండు మూడు రోజులు బాగా హైప్ చేశారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురిని కలుస్తారని చెప్పుకున్నారు.

ప్రధాని మోదీ అప్పాయింట్ మెంట్ కూడా ఖరారైందని చెప్పుకున్నారు. చివరకు అమిత్ షాను తప్పితే ఎవరినీ కలవలేదు. గురువారం ఉదయం మోదీని జగన్ కలిసే అవకాశం ఉందని చెప్పుకోగా ఆ పని జరగకుండానే జగన్ వెనుదిరిగారు. బహుశా పోయిన సారి కలిశారు కదా.. ఈ సారి వద్దులే అని మోదీ స్వయంగా కబురు చేశారేమో. మీరొచ్చేది అప్పు కోసమే కదా… కావాల్సిన టైమ్ కు ఇస్తాములే అని చెప్పారేమో. ఏదేమైనా అప్పు కోసం స్పెషల్ ఫ్లైట్ పెట్టుకున్నట్లయ్యింది.. పాపం ఆంధ్రప్రదేశ్…