దిశ ఎన్ కౌంట‌ర్ త‌ప్పే.. కానీ, త‌ప్ప‌లేదు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌హిళ‌కు కేటాయిస్తాన‌ని సీఎం కేసీఆర్ చెబితే.. తాను పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 17 మంది మంత్రులుంటే.. వారిలో ఇద్దరు మహిళలున్నారని తెలిపారు. 119 మంది ఎమ్మెల్యేల్లో మహిళలు కేవలం ఆరుగురే ఉన్నారని చెప్పారు. దీనిని బ‌ట్టి శాసనసభలో మహిళలకు సీట్లు తక్కువ అని అంగీకరిస్తామ‌ని చెప్పారు. అయితే, రాష్ట్రంలో జిల్లాపరిషత్, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తెచ్చామ‌ని కేటీఆర్ వివ‌రించారు.

శాసనసభలోనూ 33 శాతం రిజర్వేషన్లు అమలు కావాలని నిజాయితీగా కోరుకుంటున్నానని కేటీఆర్ వెల్ల‌డించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స్థానం మహిళకు ఇచ్చినా వదులుకునేందుకు సిద్ధమ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. భవిష్యత్తులో 119 స్థానాల్లో 40 కంటే అధికంగా మహిళా ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

దిశ ఎన్ కౌంటర్ నకిలీదని సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ పేర్కొందని, కానీ, మైనర్లపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసే మానవ మృగాల గురించి హక్కుల నేతలు ఎందుకు మాట్లాడరని కేటీఆర్ ప్ర‌శ్నించారు. కమిషన్ తప్పు అని చెప్పిందంటే తప్పు తప్పేన‌ని అన్నారు. కొన్నిసార్లు అలా జరిగిపోతుందని కేటీఆర్ చెప్పారు. వాటిని ప్ర‌భుత్వం కూడా ఇష్టపడడం లేద‌న్నారు.

ప్రస్తుతం అన్ని వ్యవస్థలూ కేంద్ర ప్ర‌భుత్వం, మోడీ గుప్పిట్లోకి వెళ్లిపోయాయన్నారు. న్యాయవ్యవస్థపైనా నమ్మకం లేదని ప్రజలు అంటున్నారని చెప్పారు. ఇప్పటికీ కొందరు జడ్జిలు నిజాయితీగా పనిచేస్తున్నారని, అలాంటి వారు ఉన్నందునే న్యాయవ్యవస్థపై ఇంకా ఎంతో కొంత నమ్మకం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టామ‌ని తెలిపారు. వీటి వల్ల గొలుసు దొంగతనాలు, నేరాలు చాలా వరకు తగ్గాయన్నారు.

ఎంఐఎంతో పొత్తుపై కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీ అన్నాక ఎవరి సిద్ధాంతాలు వారికుంటాయన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ అభిప్రాయాలు వేర్వేర‌ని, వాళ్లతో ముస్లిం ఓట్లు చీలుతాయి, ఇతరులకు లాభం కలుగుతుందన్న ఆరోపణలను తాను నమ్మనని చెప్పారు. మోడీకి వ్య‌తిరేకంగా ఏర్ప‌డేకూట‌మిలో తాము చేరేదీ లేనిదీ త‌మ నాయ‌కుడు కేసీఆర్ నిర్ణ‌యిస్తార‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేటీఆర్ చెప్పారు.