క‌ర్ణాట‌క‌లో మోడీకి ఎదురు గాలి.. స‌ర్వే ఏం చెబుతోందంటే!

బీజేపీ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌ను మ‌రోసారి ద‌క్కించుకోవాల‌ని.. ఆ పార్టీ పెద్ద‌లు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్ప‌టికి మూడు మాసాలు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అభివృద్ధి ప‌నుల పేరిట‌.. ఐదు సార్లు వ‌చ్చి వెళ్లారు. వ‌చ్చిన ప్ర‌తిసారీ.. ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి అనుకున్న విధంగా ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. తాజాగా వెలుగు చూసిన ఓ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

కర్ణాటకలోని నియోజకవర్గాలను సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, గ్రేటర్ బెంగళూరు, హైదరాబాద్ కర్ణాటక, ముంబయి కర్ణాటక, ఓల్డ్ మైసూర్‌గా విభజించి చూస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ABP CVoter సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా చూసి కొన్ని అంచనాలు వెలువరించింది. వీటి ఆధారంగా చూస్తే…గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38% ఓట్లు దక్కాయి. ఈ సారి అది 40%కి పెరిగే అవకాశాలున్నాయి.

ఇక బీజేపీ విషయానికొస్తే…గత ఎన్నికల్లో 36% ఓట్లు రాబట్టుకుంది. ఈ సారి 34.7%కే పరిమితమయ్యే అవకాశమున్నట్టు ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఇక మరో కీలక పార్టీ JDSకి గత ఎన్నికల్లో 18% ఓట్లు సాధించింది. ఈ సారి 17.9% వరకూ సాధించే అవకాశముంది. ఇతర పార్టీలకు 7.3% ఓట్లు దక్కనున్నట్టు అంచనా వేసింది.

సీట్ల పరంగా చూస్తే…గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తరవాత బీజేపీ చేతుల్లోకి అధికారం మారిపోయింది. అయితే…ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే…కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74, JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే…కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మోడీ వ్యూహం పారేలా క‌నిపించ‌డం లేదు.